రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నది. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను నెలకొల్పిన ప్రభుత్వం.. విద్యార్థుల కోసం వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసింది. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులను మానసికంగా ధృడంగా తీర్చిదిద్దేందుకు క్రీడలు దోహదం చేయనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 33 జిల్లాల్లో క్రీడా శిబిరాల ద్వారా విద్యార్థులను సానబెట్టేందుకు క్రీడా ప్రాధికారిక సంస్థ (సాట్స్) సిద్ధమైంది. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఆదేశాలతో జిల్లాల్లో వేసవి శిబిరాలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్లపై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : వేసవి క్రీడా శిక్షణా శిబిరాలకు వేళైంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఏప్రిల్ 15 నుంచి శిక్షణా శిబిరాలు మొదలుకాగా, మే 1 నుంచి మిగతా 32 జిల్లాల్లో ప్రారంభం కాబోతున్నాయి. జీహెచ్ఎంసీలో సాట్స్ స్టేడియాలైన ఎల్బీ, గచ్చిబౌలి, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం(యూసుఫ్గూడ), జింఖానా గ్రౌండ్స్ (సికింద్రాబాద్), సైక్లింగ్ వెలోడ్రమ్ (ఉస్మానియా యూనివర్సిటీ)లో శిక్షణా శిబిరాల్లో విద్యార్థులు సందడి చేస్తున్నారు. అనుభవం కలిగిన కోచ్ల సమక్షంలో విద్యార్థులు తమకిష్టమైన విభాగంలో కోచింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో మిగతా జిల్లాలో డీఎస్వోల పర్యవేక్షణలో శిబిరాలను విజయవంతం చేసేందుకు సాట్స్ పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ శిబిరాలపై డీఎస్వోలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిబిరాలను నిర్వహించాలని సూచించారు.
వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహణకు ప్రతి జిల్లాకు సాట్స్ లక్షా ఐదు వేల రూపాయలను మంజూరు చేసింది. దాదాపు 20 వేల మంది విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించాలన్న లక్ష్యంతో సాట్స్ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. వేసవి సెలవు దినాలను విద్యార్థులు ఉల్లాసంగా గడిపేందుకు శిక్షణా శిబిరాలు వేదికలుగా మారనున్నాయి.
చదువులు, పోటీపరీక్షలు, మార్కులు, ర్యాంకుల ఒత్తిడి నుంచి బయట పడేందుకు విద్యార్థులకు క్రీడలు దోహదం చేయనున్నాయి. విద్యార్థుల్లో దాగున్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు శిబిరాలు ఉపయోగపడనున్నాయి. విద్యార్థులకు కావాల్సిన శారీరక శ్రమ, మానసిక ఉల్లాసం, చురుకుదనం పెంపొందించేందుకు క్రీడలు కీలక పాత్ర పోషించనున్నాయి.
‘అందరికీ అందుబాటులో క్రీడలు’ అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా భాగమయ్యేలా సాట్స్ ఏర్పాట్లు చేసింది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన వాళ్లంతా..క్షేత్రస్థాయిలో కష్టపడ్డవాళ్లే. ఇలాంటి శిక్షణాశిబిరాల ద్వారా ఒక్కో మెట్టు ఎదిగి అద్భుత ప్రతిభ చాటిన వారే. మచ్చుకు ముకేశ్ (ట్రిపుల్ ఒలింపియన్, హాకీ), సైనా నెహ్వాల్, పీవీ సింధు (బ్యాడ్మింటన్), రవికాంత్రెడ్డి, వెంకటనారాయణ (వాలీబాల్), అరుణారెడ్డి (జిమ్నాస్టిక్స్) ఇలాంటి శిక్షణా శిబిరాల్లో ఓనమాలు దిద్దినవారే కావడం విశేషం.
సాట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరాలకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నాం. శిబిరాలు ముగిసిన తర్వాత ప్రతి విద్యార్థికి కోచింగ్ సర్టిఫికేట్లు అందజేస్తాం. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకునులా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి.
– ఆంజనేయగౌడ్, సాట్స్ చైర్మన్