న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన ఖాతాలో మరో టైటిల్ వేసుకుంది. ఇవాళ జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్-2022 విమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో సింధు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి మాల్విక బన్సోద్ను రెండు వరుస సెట్లలో 21-13, 21-16 స్కోర్లతో ఓడించింది. సింధూ దూకుడుతో కేవలం 35 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. బాబు బనారసి ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
రెండు సార్లు ఒలింపిక్స్ పతకం సాధించిన 26 ఏండ్ల సింధు ఆట ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఎక్కడా పట్టు దొరకనివ్వకుండా సునాయాసంగా తొలిసెట్ను గెలుచుకుంది. రెండో సెట్లోనూ అదే దూకుడును కొనసాగించి మ్యాచ్ గెలిచింది. అయితే, ఇదే టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ మ్యాచ్ రద్దయ్యింది. ఆ మ్యాచ్లో తలపడాల్సిన ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు టోర్నీ నిర్వాహకులు తెలిపారు.
ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ అర్నాడ్ మెర్కెల్, లూకాస్ క్లేయర్బౌట్ మధ్య జరుగాల్సి ఉండె. అయితే ఆ ఇద్దరిలో ఒకరికి కొవిడ్ పాజిటివ్గా తేలిందని బీడబ్ల్యూఎఫ్ ఇవాళ ఉదయం ప్రకటించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.