Chaminda Vaas : టీ20 లీగ్స్(T20 Leagues)కు ఆదరణ పెరగడంతో జాతీయ జట్టుకు ఆడే ఆటగాళ్ల సంఖ్య తగ్గుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో సహ పలు దేశాలు ఈ సమస్య ఎదుర్కొంటున్నాయి. చాలా క్రికెట్ బోర్డులను ఇబ్బంది పెడుతున్న ఈ సమస్యకు శ్రీలంక దిగ్గజ పేసర్ చమిందా వాస్(Chaminda Vaas) పరిష్కారం సూచించాడు. అన్ని దేశాల క్రికెట్ బోర్డు(Cricket Boards)లు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు(Match Fee) పెంచాలని, అప్పుడే వాళ్లు ఫ్రాంచైజీలతో దీర్ఘ కాల ఒప్పందం చేసుకోరని అన్నాడు. ‘ఒకవేళ అన్ని క్రికెట్ బోర్డులు అలా చేస్తే ఆటగాళ్లు ఏ ఫార్మాట్లో ఆడాలి? అనేది నిర్ణయించుకుంటారు. అందులో నిలకడగా పరుగులు సాధిస్తారనే నమ్మకం నాకుంది’ అని వాస్ చెప్పుకొచ్చాడు.
అంతేకాదు ఈ వెటరన్ పేసర్ తమ దేశంతో జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్(Lanka Premier League)పై కూడా స్పందించాడు. ‘ఈ లీగ్ స్థానిక ఆటగాళ్ల కెరీర్కు ఎంతో ఉపయోగపడుతుంద’ని అన్నాడు. శ్రీలంక జట్టు గొప్ప బౌలర్లలో వాస్ ముందు వరుసలో ఉంటాడు.
బంగ్లాదేశ్పై హ్యాట్రిక్ తీసిన చమిందా వాస్
ఈ ఎడమ చేతివాటం పేసర్ టెస్టుల్లో 355 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 322 మ్యాచ్లు ఆడిన వాస్ 400 వికెట్లు నేలకూల్చాడు. అంతేకాదు 2003 వరల్డ్ కప్(ODI World Cup 2003)లో బంగ్లాదేశ్పై హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో 23 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుడుగా రికార్డుల్లోకి ఎక్కాడు.
పాపులర్ టీ20 లీగ్స్
ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. టెస్టులు, వన్డేల కంటే టీ20 మ్యాచ్లకు క్రేజ్ ఎక్కువైంది. బీసీసీఐ నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) సక్సెస్ కావడంతో టీ20 లీగ్స్ హవా మొదలైంది. దాంతో, ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్ పుట్టుకొచ్చాయి. రూ. కోట్లలో ఆదాయం వస్తుండడంతో చాలామంది క్రికెటర్లు ఆ లీగ్స్లో ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీ20 లీగ్, బిగ్బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL), గ్లోబల్ టీ20 లీగ్.. ఇలా పలు దేశాల్లో పొట్టి ఫార్మాట్ లీగ్స్ జరుగుతున్నాయి.