Asia cup 2023 : ఆసియా కప్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక(Srilanka) జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కరోనా( Covid-19) బారిన పడ్డారు. కోవిడ్-19 వైరస్ లక్షణాలు కనిపించడంతో అవిష్క ఫెర్నాండో(Avishka Fernando), ఓపెనర్ కుశాల్ పెరీరా(Kusal Perera)లు టెస్టు చేయించుకున్నారు. ఇద్దరికీ పాజిటివ్ అని వచ్చింది. దాంతో, లంక శిబిరంలో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వీళ్లు లంక బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈమధ్యే ముగిసిన లంక ప్రీమియర్ లీగ్(Lanka Premer League) టోర్నీలో వీళ్లకు కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే. ఆసియా కప్ టోర్నీకి ఐదు రోజుల సమయం ఉందంతే. ఇప్పటివరకూ శ్రీలంక తమ స్క్వాడ్ను ప్రకటించలేదు. ఫెర్నాండో, పెరీరా ఈ టోర్నీలో ఆడతారా? లేదా? అనేది వాళ్లు కోలువడంపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ వీళ్లిద్దరూ కొన్ని మ్యాచ్లకు దూరమైతే అది లంక అవకాశాల్ని దెబ్బతీయనుంది. ఆగస్టు 20న ముగిసిన లంక ప్రీమియర్ లీగ్లో ఫెర్నాండో 244 రన్స్ కొట్టాడు. 2021 జనవరి నుంచి జట్టుకు దూరమైన పెరీరా ఎల్పీఎల్లో రాణించాడు. 8 మ్యాచుల్లో 210 పరుగులు సాధించాడు.
అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరా
ఈఏడాది ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్లో జరుగనుంది. ఆగస్టు 30న మొదలయ్యే ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. నిరుడు చాంపియన్గా నిలిచిన లంక ఈసారి కూడా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. అయితే.. భారత్, పాకిస్థాన్ కూడా ఈ టోర్నీ కోసం గట్టిగానే సన్నద్ధమవుతున్నాయి. దాంతో, ఈసారి విజేతగా ఎవరో ఊహించడం కొంచెం కష్టమే.