ప్రిక్వార్టర్స్కు చేరిన స్టార్ షట్లర్లు
జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్టూర్ సూపర్-300 జర్మన్ ఓపెన్లో బోణీ కొట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ సింధు 21-8, 21-7తో బుసానన్ (థాయ్లాండ్)పై అలవోక విజయం సాధించగా.. పురుషుల విభాగంలో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21-10, 13-21, 21-7తో బ్రైస్ లావెర్డెజ్ (ఫ్రాన్స్)ను చిత్తుచేశాడు. సైనా నెహ్వాల్ 21-15, 17-21, 21-14తో అజుర్మెండిపై.. లక్ష్యసేన్ 21-6, 22-20తో కంటాపోన్ వాన్చెరోన్పై గెలుపొందారు. బుసానన్పై సింధుకు ఇది 15వ విజయం కాగా.. లావెర్డెజ్పై వరుసగా నాలుగోసారి శ్రీకాంత్ పైచేయి సాధించాడు. కొవిడ్-19 సోకడంతో ఈ ఏడాది ఆరంభంలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా ఓపెన్కు దూరమైన శ్రీకాంత్.. పూర్తి స్థాయి సామర్థ్యంతో సత్తాచాటడం శుభపరిణామం. 48 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ను సునాయాసంగా చేజిక్కించుకున్న శ్రీకాంత్.. రెండో గేమ్లో వెనుకబడిపోయినా.. మూడో గేమ్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ షట్లర్ ఎన్ సిక్కిరెడ్డి-సాయిప్రతీక్ జోడీ 19-21, 8-21తో టాప్సీడ్ థాయ్లాండ్ జంట చేతిలో ఓటమి పాలైంది. గాయత్రి గోపీచంద్-ధ్రువ్ కపిల ద్వయం తొలి రౌండ్లోనే ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.