కొలంబో: ఐసీసీ టీ20 ప్రపంచకప్లో సహ ఆతిథ్యదేశంగా ఉన్న శ్రీలంక ఈ టోర్నీని విజయంతో ఆరంభించింది. సొంత మైదానం (కొలంబో)లో జరిగిన తమ తొలి మ్యాచ్లో ఆ జట్టు.. ఐర్లాండ్పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాట్తో ఆశించిన స్థాయిలో రాణించలేక చతికిలపడ్డ ఆ జట్టు.. బంతితో మాత్రం ప్రత్యర్థిని కట్టడిచేసింది. టాస్ ఓడి మొదలు బ్యాటింగ్ చేసిన లంకేయులు.. 20 ఓవర్లకు 163/6కు మాత్రమే పరిమితమయ్యారు.
కుశాల్ మెండిస్ (43 బంతుల్లో 56, 5 ఫోర్లు) నిలకడకు తోడు ఆఖర్లో కమిందు మెండిస్ (19 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ మెరుపులతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో డాక్రెట్ (2/17), మెక్కార్తి (2/40) తలా రెండు వికెట్లు తీశారు. ఛేదనలో ఐర్లాండ్ 19.5 ఓవర్లలో 143 రన్స్ వద్దే ఆగిపోయింది. హ్యారీ టెక్టర్ (40) టాప్ స్కోరర్. లంక స్పిన్నర్లు తీక్షణ (3/23), హసరంగ (3/25) తలా మూడు వికెట్లతో ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.