IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ క్వాలిఫయర్ 1లో సన్రైజర్స్ హైదరాబాద్(Sun risers Hyderabad) కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్ కొట్టిన హైదరాబాద్ జట్టు చెత్త ఆటతో కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) చేతిలో చిత్తైంది. 160 పరుగుల చిన్నపాటి లక్ష్యాన్ని కోల్కతా మరో 38 బంతులుండగానే ఊదిపడేసింది. దాంతో, అసలు ఆడుతున్నది సన్రైజర్సేనా? అని అహ్మదాబాద్ స్టేడియంలో, టీవీల ముందు కూర్చున్న అభిమానులు ఆలోచనల్లో పడ్డారు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో కమిన్స్ సేన కోల్కతాపై ఓటమిని విశ్లేషించుకుంది.
క్వాలిఫయర్ 1 పోరులో హైదరాబాద్ ఆటగాళ్లు క్రికెట్లో పాటించాల్సిన మూలాలు (బేసిక్స్)లను మర్చిపోయారని హెడ్కోచ్ డేనియల్ వెటోరీ(Daniel Vettori) అన్నాడు. ‘పరిస్థితులను అర్ధం చేసుకొని.. అందుకు తగ్గట్టు ఆడడం చాలా ముఖ్యం. ఒకటి రెండు బంతులు.. బుర్రలో తిరిగే ఆలోచనలు కొన్నిసార్లు జట్టను ఇబ్బందిలో పడేస్తాయి. అందుకని చిన్న చిన్న పొరపాట్లకు తావివ్వొద్దు.
అప్పుడే ప్రతిసారి ప్రత్యర్థిపై పైచేయి సాధించగలం. ఆ లక్షణం ప్రతిఒక్కరిలో స్వతహాగా రావాలి. అయితే.. అగ్రెస్సివ్గా ఆడాలనే మన ప్రణాళిక మాత్రం ఎప్పటికీ మారదు’ అని జట్టు సభ్యులకు వెటోరీ వివరించాడు. మే 34న ఎలిమినేటర్ విజేతతో సన్రైజర్స్ క్వాలిఫయర్ 2 ఆడనుంది. ఆ మ్యాచ్లో సర్వశక్తులు ఒడ్డితే ఆరెంజ్ ఆర్మీ ఫైనల్ చేరడం పక్కా.
అభిషేక్, హెడ్
ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఓపెనర్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. హెడ్, అభిషేక్లు రఫ్పాడిస్తే.. ఆ తర్వాత క్లాసెన్, నితీశ్, సమద్లు తలా ఓ చేయి వేస్తూ కొండంత స్కోర్ అందిస్తున్నారు. సన్రైజర్స్ భారీ స్కోర్లు నమోదు చేసిన ప్రతి మ్యాచ్లోనూ ఇదే జరిగింది. కానీ, నాకౌట్ మ్యాచుల్లో మరో చాన్స్ ఉండదు. ఓపెనర్లు విఫలమైనా మిడిలార్డర్ బాధ్యత తీసుకోవాలి.
హైదరాబాద్ బౌలింగ్ యూనిట్లో నటరాజన్ (Natarajan) మినహా ఎవరూ ప్రభావం చూపడం లేదు. వరల్డ్ క్లాస్ బౌలర్ కమిన్స్ , భువనేశ్వర్ పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోవడం సన్రైజర్స్ను కలవరపెడుతోంది. పైగా.. వనిందు హసరంగా టోర్నీకి దూరమవ్వడంతో నిఖార్సైన స్పిన్నర్ లోటు కనిపిస్తోంది. క్వాలిఫయర్ 2లో కమిన్స్ బృందం ఈ విషయాలపై ఫోకస్ పెడితేగానీ అడుగు ముందుకు పడడం కష్టమే.
ప్లే ఆఫ్స్ ముందు లక్నో సూపర్ జెయింట్ల్స్, పంజాబ్ కింగ్స్పై చిత్తకొట్టిన ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు అంతే దూకుడుగా కోల్కతా పేసర్లను ఎదుర్కోలేకపోయారు. తొలి ఓవర్లోనే స్టార్క్ యార్కర్తో హెడ్ (0)ను బౌల్డ్ చేసి షాకిస్తే.. ఆ తర్వాత వైభవ్ అరోరా తానేమీ తక్కవ కాదంటూ అభిషేక్ శర్మ(3) డగౌట్కు పంపాడు. 13 పరుగులకే ఓపెనర్లు ఔటైన వేళ క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(55) అర్ద సెంచరీతో ఆదుకున్నాడు.
హెన్రిచ్ క్లాసెన్(32), చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(30)లు ధనాధన్ ఆడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు. శ్రేయస్ అయ్యర్(58 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్(51 నాటౌట్)ల మెరుపులతో
కోల్కతా ఆ కొద్దిపాటి లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది.