Paralympics 2024 : పారాలింపిక్స్లో కొత్త చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారులపై కాసుల వర్షం కురుస్తోంది. చెక్కుచెదరని సంకల్పంతో, అసమాన పోరాటంతో పతకాల పంట పండించిన యోధులకు భారీ ప్రైజ్మనీ దక్కనుంది. విశ్వ క్రీడల్లో పసిడి కొల్లగొట్టిన ఏడుగురి తలా రూ.75 లక్షలు ఇస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ (mansukh mandaviya) వెల్లడించారు.
పారాలింపిక్స్లో వెండి పతకం సాధించినవాళ్లకు రూ. 50 లక్షలు, కాంస్యంతో పోడియం మీద నిలిచిన వాళ్లకు రూ.30 లక్షలు ప్రోత్సాహక బహుమతిగా అందజేస్తామని ఆయన చెప్పారు. ఇక మిక్స్డ్ టీమ్ విభాంలో పతకంతో సత్తా చాటినవాళ్లకు రూ.22.5 లక్షల నగదు ఇవ్వనున్నట్టు మాండవీయ ఓ ప్రకటనలో తెలిపారు.
పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్లో భారత క్రీడాకారులు కొత్త చరిత్ర లిఖించారు. రికార్డులు తిరగరాస్తూ పారా విశ్వ క్రీడల చరిత్రలోనే దేశానికి అత్యధిక పతకాలు అందించారు. దాంతో, భారత్ ఖాతాలో మునుపెన్నడూ లేని విధంగా 29 పతకాలు వచ్చి చేరాయి. పారిస్లో మన క్రీడాకారులు పారా విశ్వ క్రీడల్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు కొల్లగొట్టారు. దాంతో, ఈసారి ఇండియా పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచింది.
అవని, మోనా, మనీశ్, ప్రీతి
పారాలింపిక్స్ ఆఖరి రోజు జరిగిన జావెలిన్ త్రోలో నవ్దీప్ సింగ్ (Navdeep Singh) స్వర్ణంతో గర్జించాడు. దాంతో, భారత్ పతకాల సంఖ్య 29కి చేరింది. విశ్వ క్రీడల రెండో రోజు షూటర్ అవనీ లేఖరా(Avani Lekhara) స్వర్ణంతో పతకాల ఖాతా తెరిచింది. అవనితో పాటు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్ చేరిన మోనా అగర్వాల్ కంచు మోత మోగించింది. అక్కడితో మొదలు భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగించారు.
Paralympics 2024 have been special and historical.
India is overjoyed that our incredible para-athletes have brought home 29 medals, which is the best ever performance since India’s debut at the Games.
This achievement is due to the unwavering dedication and indomitable spirit… pic.twitter.com/tME7WkFgS3
— Narendra Modi (@narendramodi) September 8, 2024
అథ్లెటిక్స్లో ప్రీతి పాల్ (Preethi Pal) చిరుతను తలపిస్తూ.. 100 మీటర్లు, 200 మీటర్ల పోటీల్లో కాంస్యంతో చరిత్ర సృష్టించింది. షూటర్ మనీష్ నర్వాల్ రజతం కొల్లగొట్టాడు. తెలంగాణ అమ్మాయి దీప్తీ జీవాంజీ 400 మీటర్ల పరుగులో కంచు మోత మోగించింది. ఆర్చరీ, జావెలన్ త్రో, హైజంప్, షాట్పుట్, డిస్కస్ త్రో, క్లబ్ త్రో, జూడో, బ్యాడ్మింటన్లో భారత క్రీడాకారులు పతకాలతో యావత్ భారతావనిని సంబురాల్లో ముంచెత్తారు.