ICC World Cup | దక్షిణాఫ్రికా ముందు శ్రీలంక విలవిల్లాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్లు.. శ్రీలంక బౌలర్లను చీల్చి చెండాడారు. తర్వాత 429 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక బ్యాట్స్మన్లను 31 పరుగులు మిగిలి ఉండగానే 326 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా శ్రీలంకపై సౌతాఫ్రికా 102 పరుగులతో విజయం సాధించింది.
భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఓపెనర్లలో పథుమ్ నిస్సాంక.. తొలి బంతికే డకౌట్ అయ్యాడు. తర్వాత వన్ డౌన్ బ్యాటింగ్కు వచ్చిన కుషాల్ మెండిస్ 76, చరిత్ అసలంక 79, సారధి దసున్ శనక 68 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. చివర్లో కసున్ రజిత 33, సదీరా సమర విక్రమ 23 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు నిలకడగా క్రీజ్ లో నిలబడలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లు గెరాల్డ్ కూట్జీ మూడు, కేశవ్ మహరాజ్, కసిగో రబడా, మాక్రో జన్సెన్ రెండేసీ, లుంగీ నైగీ ఒక వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచిన సౌతాఫ్రికా నిర్దిష్ట 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 428 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డీకాక్ 84 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 100 పరుగులు, రసీ వన్ డీర్ డసన్ 110 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లలో 108 పరుగులు, అడైన్ మార్క్రమ్ 49 బంతుల్లో సెంచరీ చేశాడు. 54 బంతుల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. 49 బంతుల్లో శరవేగంగా మార్క్రమ్ సెంచరీ చేసిన రికార్డు నమోదు చేశాడు.
అలాగే ఒక మ్యాచ్లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీ పూర్తి చేసిన రికార్డును సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. అంతే కాదు.. వరల్డ్ కప్ టోర్నీలో ఒక మ్యాచ్లో దక్షిణాఫ్రికా 428 పరుగులతో అత్యధిక స్కోర్ చేసిన టీంగా నిలిచింది. అంతకుముందు 2015లో ఆఫ్ఘనిస్థాన్పై ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి 417 స్కోర్ నమోదు చేసింది. తాజాగా శ్రీలంకపై సౌతాఫ్రికా భారీ స్కోర్తో ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది.