సిడ్నీ: వన్డౌన్ ఆటగాడు రిలీ రాసో (56 బంతుల్లో 109; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) పూనకం వచ్చినట్లు రెచ్చిపోవడంతో టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా తొలి విజయం నమోదు చేసుకుంది. గ్రూప్-2లో భాగంగా గురువారం జరిగిన పోరులో సఫారీ జట్టు 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తుచేసింది. దక్షిణాఫ్రికా ఆడిన గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఈ విజయంతో ప్రొటీస్ 2 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రాసో రికార్డుల్లోకెక్కగా.. స్టార్ ఆటగాడు డికాక్ (38 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టాడు. బంగ్లా బౌలర్లలో కెప్టెన్ షకీబుల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (34) టాప్ స్కోరర్ కాగా.. తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్జే 4, షంసీ మూడు వికెట్లు పడగొట్టారు. రాసోకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.