Sourav Ganguly : భారత మాజీ కెప్టన్ సౌరభ్ గంగూలీ(Sourav Ganguly ) ఇంట్లో దొంగతనం జరిగింది. కోల్కతాలోని బెహలా(Behala)లో ఉన్న దాదా ఇంట్లోకి చొరబడిన దొంగలు.. రూ.1.6 లక్షల విలువైన ఫోన్ ఎత్తుకెళ్లారు. దాంతో, గంగూలీ వెంటనే సమీపంలోని థాకురుపుకుర్(Thakurupura) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫోన్లో వ్యక్తిగత సమాచారం ఉందని, దాన్ని దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలని గంగూలీ పోలీసులను కోరాడు. అసలేం జరిగిందటే…
ఇంట్లోని ఒక ప్లేస్లో ఫొన్ దాచి పెట్టిన దాదా బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి అక్కడ ఫోన్ కనపడలేదు. అందులో పలువురి కాంటాక్ట్లతో పాటు, ముఖ్యమైన డేటా ఉందట. దాంతో, మాజీ బీసీసీఐ బాస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులను ఆశ్రయించాడు. ఈ మధ్యే గంగూలీ ఇంటికి పెయింటింగ్ వేశారు. దాంతో, పెయింటింగ్ వేసిన వాళ్లలో ఎవరో ఒకరు అతడి ఫోన్ను కాజేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకని వాళ్లను పిలిపించి విచారిస్తున్నారు.
సౌరభ్ గంగూలీ
భారత జట్టు క్రికెట్కు దూకుడు నేర్పిన కెప్టెన్గా పేరొందిన గంగూలీ ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశాడు. ప్రస్తుతం దాదా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్(Director of Cricket)గా సేవలందిస్తున్నాడు.
రిషభ్ పంత్
నిరుడు ఐపీఎల్లో 9వ స్థానంలో నిలిచిన ఢిల్లీ.. ఈసారి టైటిల్ కొట్టాలనే కసితో ఉంది. మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న కెప్టెన్ రిషభ్ పంత్(Rishabh Pant) 17వ సీజన్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాంతో, ఢీల్లీ మేనేజ్మెంట్తో పాటు జట్టు మొత్తం కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది.