అహ్మదాబాద్: ఐపీఎల్-18 సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణిస్తున్న పంజాబ్ కింగ్స్ తొలి క్వాలిఫయర్లో ఓడినా రెండో క్వాలిఫయర్లో అదరగొట్టింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్కు అర్హత సాధించింది. ముంబై నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు.. 19 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి ఛేదించింది. శ్రేయాస్ అయ్యర్ (41 బంతుల్లో 87*, 5 ఫోర్లు, 8 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్కు తోడు నెహల్ వధెర (48), జోష్ ఇంగ్లిస్ (38) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. వరుణుడి ఆటంకంతో రెండు గంటల పాటు ఆలస్యంగా మొదలైన మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసి ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై జట్టులోని హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (29 బంతుల్లో 44, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చి మెరుపులు మెరిపించాడు. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 44, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి రెచ్చిపోగా జానీ బెయిర్ స్టో (24 బంతుల్లో 38, 3 ఫోర్లు, 2 సిక్స్లు), నమన్ ధీర్ (18 బంతుల్లో 37, 7 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ఈ విజయంతో పంజాబ్ మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.
టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలో పంజాబ్ బౌలర్లు అతడి నమ్మకాన్ని నిలబెట్టినా తర్వాత గతి తప్పారు. గత మ్యాచ్లో అర్ధ శతకంతో రాణించిన రోహిత్ శర్మ (8).. పంజాబ్తో కీలకపోరులో తేలిపోయాడు. స్టోయినిస్ వేసిన మూడో ఓవర్లో అతడు.. విజయ్కుమార్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సాధారణంగా బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో వచ్చే తిలక్ను ముంబై.. వ్యూహం మార్చి ముందుగా పంపించింది. జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని తిలక్ వమ్ముచేయలేదు. ఓపెనర్ బెయిర్ స్టోతో కలిసి ముంబై స్కోరుబోర్డును ఉరకలెత్తించాడు. ఎదుర్కున్న రెండో బంతినే సిక్సర్గా మలిచాడు. అర్ష్దీప్ వేసిన మరుసటి ఓవర్లో బెయిర్ స్టో రెండు బౌండరీలు రాబట్టాడు. అజ్మతుల్లా ఐదో ఓవర్లో అతడు.. 4, 6తో రెచ్చిపోవడంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై 65/1గా నిలిచింది. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే విజయ్కుమార్.. బెయిర్ స్టోను ఔట్ చేయడంతో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. దీంతో తిలక్కు సూర్య జతకలవడంతో ముంబై స్కోరుబోర్డు రాకెట్ వేగాన్ని తలపించింది. ఈ ఇద్దరూ పంజాబ్ బౌలర్లను ఉతికారేస్తూ ఒక్కో ఓవర్కు 10 పరుగులు తగ్గకుండా దండుకున్నారు. ఈ జోడీ దూకుడుగా ఆడి 42 బంతుల్లోనే 72 పరుగులు జతచేయడం విశేషం. ప్రమాదకరంగా మారుతున్న ఈ ద్వయాన్ని చాహల్ విడదీశాడు. అతడు వేసిన 14వ ఓవర్లో సూర్య.. 4, 6 బాదినా ఐదో బంతికి వధెరకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రెండు బంతుల వ్యవధిలోనే తిలక్.. జెమీసన్ బౌలింగ్లో ప్రియాన్ష్కు క్యాచ్ ఇవ్వడంతో ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. ముంబై సారథి హార్దిక్ (15) నిరాశపరిచినా ఆఖర్లో నమన్ బౌండరీలతో రెచ్చిపోయాడు.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ప్రభ్సిమ్రన్ (6) వికెట్ కోల్పోయినా మరో ఓపెనర్ ప్రియాన్ష్ (20), మూడో స్థానంలో వచ్చిన జోష్ ఇంగ్లిస్ (38) దూకుడుగా ఆడటంతో ఛేదనను రసవత్తరంగా మార్చేశారు. ఈ ఇద్దరూ రెండో వికెట్కు 18 బంతుల్లోనే 42 రన్స్ జోడించారు. కానీ రెండు ఓవర్ల వ్యవధిలో కింగ్స్ ఈ ఇద్దరి వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ శ్రేయాస్, నెహల్ వధెర ధాటిగా ఆడి కింగ్స్ను మళ్లీ గెలుపు రేసులోకి తెచ్చారు. టాప్లీ వేసిన 13వ ఓవర్లో శ్రేయాస్ హ్యాట్రిక్ సిక్సర్లతో రెచ్చిపోతే బౌల్ట్ ఓవర్లో వధెర రెండు బౌండరీలు బాదాడు. కానీ నెహాల్, శశాంక్ (2) వెంటవెంటనే నిష్క్రమించినా అయ్యర్ ధాటిగా ఆడి లాంఛనాన్ని పూర్తిచేశాడు.
ముంబై: 20 ఓవర్లలో 203/6 (తిలక్ 44, సూర్య 44, అజ్మతుల్లా 2/43, స్టోయినిస్ 1/14);
పంజాబ్: 19 ఓవర్లలో 207/5 (శ్రేయాస్ 87*, వధెర 48, అశ్వని 2/48, హార్దిక్ 1/19)