Shoaib Malik – Sania Mirza | భారత టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza ), పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) విడాకులు (Divorce) తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. మాలిక్తో బ్రేకప్ చెప్పేందుకు సానియా సిద్ధమైనట్లు టాక్ వినిపించింది. ఈ స్టార్ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, ఇద్దరూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారంటూ పాకిస్థాన్ మీడియా సైతం ప్రచారం చేసింది. ఓ పాకిస్థాన్ మోడల్ కారణంగా వీరిమధ్య విభేదాలు తలెత్తాయంటూ అక్కడి మీడియా పేర్కొంది. ఈ వార్తలపై అటు మాలిక్ గానీ, సానియా గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
ఈ రూమర్స్పై తాజాగా షోయబ్ స్పందించారు. పాకిస్థాన్ ‘జియో న్యూస్’తో ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి రూమర్లను తాము పట్టించుకోబోమని స్పష్టం చేశారు. అందుకనే తాను కానీ, ఆమె (సానియా) కానీ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. సానియాతో కలిసి గడిపేందుకు సమయం దొరకట్లేదని వ్యాఖ్యానించారు. ‘ఇందులో చెప్పడానికేమీ లేదు. సానియాతో కలిసి గడిపేందుకు సమయం దొరకట్లేదు. ఈద్ వేళ మేమిద్దరం కలిసి ఉంటే ఎంతో గొప్పగా ఉండేది. అయితే కొన్ని ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ కారణంగా సానియా రాలేకపోయింది. మా ఇద్దరిలో ఎవరికి సమయం దొరికినా ఇరు దేశాలకు వచ్చి వెళ్తుంటాము. మేం ఎప్పుడూ ప్రేమను పంచుకుంటూ ఉంటాము. ఆమెను నేను చాలా మిస్ అవుతున్నా. నేను చెప్పాలనుకున్నది ఇదే’ అని విడాకుల పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.
ఇదే సందర్భంలో భారత్ (India)-పాకిస్థాన్ (Pakistan) మధ్య క్రికెట్ బంధాల గురించి షోయబ్ ప్రస్తావించారు. భారత్-పాక్ మధ్య క్రికెట్ బంధాలు మెరుగవ్వాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరుదేశాల క్రికెట్ అభిమానులే కాదు.. వేరే దేశాల అభిమానాలు కూడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే చూడాలని తపనపడుతుంటారని పేర్కొన్నారు.
కాగా.. దాయాదిదేశమైన పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2010లో హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. 2018లో ఈ దంపతులకు ఓ కుమారుడు (ఇజాన్) జన్మించాడు.
Also Read..
Indonesia | ఇండోనేసియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Virat Kohli: విరాట్ కోహ్లీకి 24 లక్షల జరిమానా