Shikhar Dhawan : టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) మైదానంలో ఎంత సరదాగా ఉంటాడో తెలిసిందే. రోహిత్ శర్మ జోడీగా ఎన్నో గొప్ప విజయాలు అందించిన గబ్బర్ తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. స్పోర్ట్స్ టాక్ ( Sports Tak) ఇంటర్వ్యూలో మాట్లాడిన అతను.. భార్య అయేషా ముఖర్జీ(Aesha Mukherjee)తో విడాకుల గురించి తొలిసారి పెదవి విప్పాడు. ప్రేమలో ఉన్నప్పుడు ప్రమాద హెచ్చరికలు ఉంటాయనే విషయం తనకు తెలియదని, తాను వైవాహిక జీవితంలో విఫలమయ్యానని ఈ మాజీ ఓపెనర్ చెప్పుకొచ్చాడు.
‘ఆటగాడిగా రాణించిన నేను దాంపత్య జీవితంలో మాత్రం ఫెయిలయ్యాను. ఎందుకో తెలుసా..? పెళ్లి తర్వాతి జీవితం గురించి నాకు పెద్దగా తెలియదు. అలాగని నా భాగస్వామిని వేలెత్తి చూపను. ఎందుకంటే.. విడాకులు తీసుకోవాలన్నది నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం. ఇప్పటికీ నా విడాకుల వ్యవహారం తేలలేదు. మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ప్రస్తుతం లేదు. ఒకవేళ చేసుకోవాలనుకుంటే నేను మరింత తెలివిగా ఉండాలి. నాకు ఎలాంటి అమ్మాయి సరిపోతుందో తెలుసుకోవాలి. ఆమెతోనే ఇక జీవితాంతం కలిసి ఉండాలి కదా!. అంతేకాదు క్రికెట్ గురించి నేను మాట్లాడే విషయాలన్నీ 20 ఏళ్ల క్రితం నాకు తెలియవు. ఏదైనా సరే అనుభవంతోనే అవగతం అవుతుంది’ అని శిఖర్ ధావన్ తెలిపాడు.
తాను ప్రేమలో పడినప్పటి రోజులను ధావన్ గుర్తు చేసుకునన్నాడు. ’26- 27 ఏళ్ల వయసులో నేను క్రికెట్ మీదే దృష్టి పెట్టేవాడిని. ఆ సమయంలో ఎవరితోనూ రిలేషన్షిప్లో లేను. ఒక్కసారి ప్రేమలో పడ్డాక.. ప్రమాద హెచ్చరికలను గమనించలేదు. ఇప్పుడు నేను ప్రేమలో పడితే వాటిని ముందుగానే చూడగలను. అలాంటివి ఉంటే అక్కడితో లవ్ ఆపేస్తా. లేదంటే ప్రొసీడ్ అవుతా’ అని వెల్లడించాడు. అంతేకాదు రిలేషన్షిప్లో అడుగుపెట్టనున్న యంగ్స్టర్స్కు సలహాలు చెప్పాడు. భాగస్వామితో గడపడాన్ని ఆస్వాదిస్తేనే ఆ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని ధావన్ సూచించాడు.
రెండేళ్ల క్రితం భార్య అయేషా ముఖర్జీకి విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించి ధావన్ అందర్నీ షాక్కు గురి చేశాడు. ఆస్ట్రేలియాలో నివసించే అయేషా, శిఖర్ ధావన్ 2012లో పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు గబ్బర్ తెలిపాడు. అయితే.. అందుకు కారణాలు ఏంటనేది మాత్రం అతను వెల్లడించలేదు. ఐపీఎల్ 2023లో ఈ మాజీ ఓపెనర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.