అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. గత కొన్నేండ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నాను. బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో పతకం సాధించడం మరిచిపోలేని అనుభూతి. ఈ అవార్డును తల్లిదండ్రులతో పాటు కోచ్కు అంకితమిస్తున్నాను. అవార్డు దక్కడంలో నాకు మద్దతుగా నిలిచిన కేంద్ర, రాష్ట్ర క్రీడాశాఖలకు, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్లకు కృతజ్ఞతలు. అవార్డు దక్కిన ఉత్సాహంతో భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధిస్తాను.
– ఆకుల శ్రీజ
అర్జున అవార్డు రావడం ఆనందంగా ఉంది. సహకరించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డికి ధన్యవాదాలు.
– నిఖత్ జరీన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ను అర్జున అవార్డు వరించింది. ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన నిఖత్.. బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకొని అదుర్స్ అనిపించింది. ఆమె ప్రతిభను గుర్తించిన అవార్డుల కమిటీ నిఖత్కు అర్జున అవార్డు ప్రకటించింది. ఈ నెల 30 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిఖత్ అర్జున అవార్డు అందుకోనుంది. రాష్ర్టానికి చెందిన యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజకూ అర్జున అవార్డు దక్కింది. బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల మిక్స్డ్ డబుల్స్ విభాగంలో శరత్ కమల్తో కలిసి స్వర్ణం నెగ్గిన శ్రీజ.. ఇటీవలి కాలంలో వరుస విజయాలతో జోరు మీదున్న విషయం తెలిసిందే. టేబుల్ టెన్నిస్ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్ కమల్కు ఖేల్ రత్న అవార్డు దక్కింది.
శ్రీజ అంచలంచెలుగా
ఆకుల శ్రీజ అంచలంచెలుగా ఎదిగింది. టేబుల్ టెన్నిస్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటుతున్నది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆలోచనతో శ్రీజ ఈ మధ్యకాలంలో అంచనాలకు మించి రాణిస్తున్నది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ సోమ్నాథ్ భారతి శిక్షణలో రాటు దేలింది. బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో ప్రతిభ నిరూపించుకుంటూ పతకాలు కొల్లగొడుతున్నది. పోటీ ఏదైనా పతకం పక్కా అన్న రీతిలో దూసుకెళుతున్నది. ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెరువని నైజం ప్రదర్శిస్తున్నది. టోర్నీ టోర్నీకి తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకుంటూ టీటీలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇటీవలే బర్మింగ్హామ్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో పసిడి కాంతులు విరజిమ్మింది.
రింగ్లో తనతో తలపడేందుకు అమ్మాయిలు సిద్ధంగా లేని సమయంలో.. అబ్బాయిలతోనే పోటీ పడతానని భీష్మించుకు కూర్చున్న ఆమె పట్టుదలకు!
బాక్సింగ్లో దెబ్బలు తగిలితే నిన్నెవరూ పెండ్లి చేసుకోరని అమ్మ ఆందోళన చెందినా..భయపడకమ్మా మన ఇంటి ముందు పెళ్లి కొడుకులతో లైన్ కట్టిస్తా అన్న ఆమె తెగువకు!
నిన్న గాక మొన్న వచ్చింది.. నాతోనే పోటీనా అని బాక్సింగ్ దిగ్గజమే ఎగతాళి చేసినా..ఎవరు ఉత్తమమో బౌట్లో తేలాల్సిందే అని తెగేసి చెప్పిన ఆమె ధైర్యానికి!
అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించడం అంత సులువు కాదనే విమర్శలెదురైనా..ప్రపంచ చాంపియన్షిప్, కామన్వెల్త్లో స్వర్ణాలతో వాటికి బదులు చెప్పిన ఆమె ప్రతిభకు!
అవార్డుల కమిటీ సలాం కొట్టింది. ఇందూరులో బాక్సింగ్ ఓనమాలు నేర్చిన మన తెలంగాణ మేలిమి బంగారం నిఖత్ జరీన్కు అర్జున అవార్డు వరించింది. అరకొర వసతుల నుంచి అందలమెక్కిన ఆమె ఘనతను ఓసారి గుర్తు చేసుకుంటే..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
బాక్సింగ్ అంటే పెద్దగా తెలియని ఊరు.. అందులోనూ సంప్రదాయ మధ్య తరగతి కుటుంబం. ఆట పాటలకు ప్రత్యేక శిక్షణ అంటే ఖర్చుకు భయపడి వెనుకడుగేసే రోజుల్లోనే ఆమె బాక్సింగ్ను కెరీర్గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత వద్దని వారించినా.. రింగ్లో అడుగు పెట్టాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని తెగేసి చెప్పింది. నిజామాబాద్లో పుట్టి పెరిగిన నిఖత్ జరీన్.. తండ్రి జమీల్ ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంది.
బాక్సింగ్ దిగ్గజం, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ తలపడుతున్న వెయిట్ కేటగిరీలోనే నిఖత్ కూడా పోటీ పడుతుండటంతో.. చాన్నాళ్ల వరకు ఆమె ప్రతిభ వెలుగులోకి రాలేదు. అయితే టోక్యో ఒలింపిక్స్కు దేశం నుంచి బాక్సర్లను ఎంపిక చేస్తున్న సమయంలో నిఖత్ జరీన్ పేరు పరిగణనలోకి తీసుకోకుండా.. నేరుగా మేరీకోమ్కు అవకాశం కల్పించడంపై అప్పట్లో నిఖత్ పెదవి విప్పింది. ఇద్దరి మధ్య పోటీ నిర్వహించి నెగ్గిన వారినే టోక్యో పంపాలని బలంగా కొట్లాడింది. దేశ రాజధానిలో నిర్వహించిన ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో జరీన్ పరాజయం పాలైనా.. తన పోరాటంతో మేరీ మనసు గెలుచుకోగలిగింది. అక్కడి నుంచి మరింత పట్టుదల పెంచుకున్న నిఖత్.. ఈ ఏడాది ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచింది. మేటి బాక్సర్లను మట్టి కరిపిస్తూ ఒక్కో అడుగు ముందుకేసిన నిఖత్ జగజ్జేతగా అవతరించింది. అదే ఊపులో బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకం ముద్దాడింది. తన కెరీర్ తొలినాళ్లలో వెన్నంటి ప్రోత్సహించిన ఎమ్మెల్సీ కవితకు ఈ సందర్భంగా నిఖత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.