లలిత్ మోదీ ఆగ్రహం
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో దేశ ప్రజలకు సాయం చేసేందుకు భారత స్టార్ క్రికెటర్లు, బీసీసీఐ ముందుకు రాకపోవడంపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ తీవ్రంగా విమర్శించాడు. క్లిష్ట సమయాల్లో ప్రజలకు సాయం అందించాల్సిన అవసరం ఉందని, అయితే వారు ఏమీ చేయకపోవడం సిగ్గుచేటని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం లండన్లో ఉన్న లలిత్ సోమవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. కరోనాతో పోరాడేందుకు ఐపీఎల్ ఆదాయంలో 10 శాతం అంటే రూ.800కోట్లను బీసీసీఐ విరాళంగా ప్రకటించాలని అన్నాడు. మరోవైపు భారత ఆటగాళ్లు కొందరు కరోనాపై పోరుకు విరాళాలు ప్రకటించినా అధిక శాతం స్టార్ ప్లేయర్లు ముందుకు రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అలాగే ఆసీస్ పేసర్ కమిన్స్, బ్రెట్ లీ సహా మరికొంత మంది విదేశీ ప్లేయర్లు విరాళాలు ఇచ్చినా మన క్రికెటర్లు ముందుకు రాకపోవడంపై అసంతృప్తి రేగుతున్నది.