Shafali Verma | అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో మన అమ్మాయిలు రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఐసీసీ తొలిసారి నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. ఫేవరెట్గా బరిలోకి దిగిన యంగ్ ఇండియా ఆదివారం జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. మహిళల విభాగంలో ఇప్పటి వరకు భారత జట్టు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలువలేకపోగా.. ఈ గెలుపుతో ఆ లోటు తీరినట్లైంది. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ షఫాలీ వర్మ భావోధ్వేగానికి గురయ్యారు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెజెంటేషన్ సెరిమొనిలో షఫాలీ కన్నీరు ఆపుకోలేకపోయారు.
‘కప్ గెలిచినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇదో అపురూపమైన అనుభూతి. అందమైన జట్టును నాకు అందించినందుకు బీసీసీఐకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు అన్ని విధాలా అండగా నిలిచిన బీసీసీఐ, సిబ్బందికి ధన్యవాదాలు. వారి మద్దతు వల్లనే మేము ఇక్కడిదాకా వచ్చాం. కప్పు గెలవగలిగాం. అమ్మాయిలంతా అద్భుత ప్రదర్శన ఇచ్చారు’ అంటూ షఫాలీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఆదివారం జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 17.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది. రియానా మెక్డొనాల్డ్ (19) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో టిటాస్ సధు, అర్చనా దేవి, పార్షవి చోప్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యంగ్ ఇండియా 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. తెలంగాణ యువ కెరటం గొంగడి త్రిష (24), సౌమ్య తివారి (24), కెప్టెన్ షఫాలీ వర్మ (15) రాణించారు. టిటాస్ సధుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ఇంగ్లండ్ ఆల్రౌండర్ గ్రేస్ స్క్రీవెన్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. మహిళల విభాగంలో ఇప్పటి వరకు భారత జట్టు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలువలేకపోగా.. ఇప్పుడు బాలికలు ఆ లోటు తీర్చారు.