ముంబై : ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై తమ విజయయాత్రను కొనసాగిస్తున్న సూర్యకుమార్యాదవ్ నేతృత్వంలోని టీమ్ఇండియా..ఇంగ్లండ్తో గురువారం సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడాలన్న పట్టుదలతో ఉన్న ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డేందుకు సమాయత్తమయ్యాయి. మెగాటోర్నీలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి మినహాయిస్తే భారత్ నిలకడ కనబరుస్తున్నది. సొంత ఇలాఖాలో బాగా అలవాటైన పిచ్లపై ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ ఒక్కో అడుగు ముందుకేస్తున్నది. కోల్కతా ఈడెన్గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన ఆఖరి సూపర్-8 పోరులో టీమ్ఇండియా సత్తాచాటింది. పడుతూలేస్తూ సాగుతున్న తన కెరీర్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్తో సంజూ శాంసన్..విండీస్ ఆశలపై నీళ్లు గుమ్మరించి భారత విజయానికి బాటలు వేశాడు.
సహచరులు విఫలమైన వేళ తన ఉనికిని చాటుకుంటూ శాంసన్ సాధికారిక ఇన్నింగ్స్ అభిమానుల మదిలో అచిరకాలం గుర్తుండిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇంగ్లండ్తో సెమీస్లోనూ సమష్టి ప్రదర్శనతో సత్తాచాటేందుకు సూర్యకుమార్ సేన తహతహలాడుతున్నది. అచ్చొచ్చిన వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్ భరతం పట్టేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. శాంసన్ రాకతో టాపార్డర్లో గాడిలో పడగా, ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న యువ ఓపెనర్ అభిషేక్శర్మ బ్యాటు ఝులిపించాల్సిన సమయం ఆసన్నమైంది. జింబాబ్వేతో మ్యాచ్లో అర్ధసెంచరీ మినహా అభిషేక్ నుంచి ఆశించిన ప్రదర్శన లేకపోవడం టీమ్ మేనేజ్మెంట్ను ఆందోళనకు గురి చేస్తున్నది. ఫస్ట్డౌన్లో బ్యాటింగ్కు వస్తున్న ఇషాన్ కిషన్ ఆదిలో మెరుపులు మెరిపించినా ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. మిడిలార్డర్లో కెప్టెన్ సూర్యకుమార్తో పాటు తిలక్వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే తమ సత్తాచాటాల్సి ఉంది. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు కుదురుకున్నా..భారత్కు భారీ స్కోరు సాధ్యమైనట్లే. విండీస్తో ఆడిన జట్టునే ఇంగ్లండ్తో పోరులో కొనసాగించే అవకాశముంది.
బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా తనదైన పేస్తో ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేస్తుండగా, అర్ష్దీప్సింగ్ జతకలిస్తే మన పని సులువైనట్లే. వరుణ్ చక్రవర్తి సూపర్-8 మ్యాచ్ల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటుండగా, అక్షర్పటేల్ పొదుపు పాటిస్తున్నాడు. ఆరో బౌలర్గా దూబేను దింపాల వద్దా అనేది సూర్య విచక్షణపై ఆధారపడి ఉన్నది. శాంసన్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ కుదురుకోగా, బౌలర్లు కట్టడి చేయాల్సి ఉంది. మరోవైపు మెగాటోర్నీలో ఇంగ్లండ్ ఒడిదుడుకుల పయనంగా సాగుతున్నది. నేపాల్ చేతిలో చావుతప్పి కన్నులొట్టబోయిన ఇంగ్లండ్..ఆ తర్వాత కుదురుకున్నది. పసికూన ఇటలీ ఒక రకంగా భయపెట్టినా విజయం వైపు నిలిచింది. సూపర్-8లో శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్పై అద్భుత విజయాలు సాదించిన బ్రూక్ గ్యాంగ్ అదే జోరులో టీమ్ఇండియాకు బ్రేక్లు వేయాలని చూస్తున్నది. బ్రూక్ ఫామ్లోకి రాగా, విల్ జాక్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకమవుతున్నాడు. బట్లర్ పేలవఫామ్లో ఉండగా, సాల్ట్ రాణించాల్సి ఉంది.