Riyan Parag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్తాన్ రాయల్స్లో ఆడే యువ ఆటగాడు రియాన్ పరాగ్ భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. దేశవాళీలో తన సొంత రాష్ట్రం అస్సాం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువ ఆల్ రౌండర్ ఇటీవలికాలంలో అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇటీవలే దేశవాళీలో ముగిసిన దేవ్దార్ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 (స్మాట్) టోర్నీలో పరుగుల వరద పారించాడు. తద్వారా సెలక్టర్లు.. పరాగ్ను వరల్డ్ కప్ తర్వాత భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే టీ20 సిరీస్కు ఎంపిక చేయనున్నట్టు తెలుస్తున్నది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పరాగ్.. ఆడిన పది మ్యాచ్లలో 510 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఏడు అర్థ సెంచరీలు (ఆరు వరుసగా) కూడా ఉన్నాయి. స్మాట్లో పరాగ్ సగటు 85 కాగా స్ట్రైక్ రేట్ 182.79గా ఉంది. స్మాట్లో అస్సాం జట్టును సెమీఫైనల్కు చేరడంతో పరాగ్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటర్ గానే గాక బౌలర్గా కూడా పరాగ్.. స్మాట్లో 11 వికెట్లు పడగొట్టాడు. స్మాట్ కంటే ముందే జరిగిన దేవ్దార్ ట్రోఫీలో కూడా అతడే హయ్యస్ట్ స్కోరర్. ఆ టోర్నీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతూ ఐదు మ్యాచ్లలోనే 354 పరుగులు చేసిన పరాగ్.. రెండు సెంచరీలు ఓ అర్థసెంచరీతో రాణించాడు. ఈ టోర్నీలో కూడా పరాగ్ 11 వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు.
Riyan Parag is likely to get his maiden India call in the Australia T20I series. [TOI] pic.twitter.com/1SpUkAfIQ2
— Johns. (@CricCrazyJohns) November 6, 2023
దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న పరాగ్కు జాతీయ జట్టులో చోటు దక్కడం ఖాయమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వచ్చే వారం జట్టును ప్రకటించబోయే సెలక్టర్లు పరాగ్ పేరును చేరుస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ 23 నుంచి మొదలుకాబోయే భారత్ – ఆసీస్ టీ20 సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చి రుతురాజ్ సారథ్యంలో జట్టును ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం.