ఐపీఎల్-17లో ప్లేఆఫ్స్ చేరిన రాజస్థాన్ రాయల్స్ టాప్-2లో నిలిచే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. బుధవారం గువహటి వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్లో 5 వికెట్ల తేడాతో ఓడిన ఆ జట్టు.. వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్లో విఫలమైన ఆ జట్టు బౌలింగ్తో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే యత్నం చేసినా పంజాబ్ సారథి సామ్ కరన్ ఆల్రౌండ్ షోతో రాయల్స్కు షాకిచ్చాడు.
IPL 2024 | గువహటి: ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తును దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ కింగ్స్తో నామమాత్రపు మ్యాచ్లో తడబడింది. గువహటి వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడింది. ఇరు జట్ల బ్యాటర్లు తడబడి బౌలర్లకు అనుకూలించిన బర్సపర పిచ్పై మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 144/9 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాపార్డర్ విఫలమైనా ‘లోకల్ బాయ్’ రియాన్ పరాగ్ (34 బంతుల్లో 48, 6 ఫోర్లు) ఆ జట్టును ఆదుకున్నాడు. సామ్ కరన్ (2/24), హర్షల్ పటేల్ (2/28), చాహర్(2/26) రాజస్థాన్ను కట్టడిచేశారు. అనంతరం స్వల్ప ఛేదనలో పంజాబ్ కూడా తడబడింది. కానీ బంతితో రాణించిన కెప్టెన్ కరన్ (41 బంతుల్లో 63 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కరన్ కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) తొలి ఓవర్లోనే నిష్క్రమించగా కోహ్లర్ కడ్మొర్ (18) ధాటిగా ఆడలేకపోయాడు. కెప్టెన్ శాంసన్(18) మూడు సిక్సర్లతో దూకుడు మీద కనిపించినా అతడూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్ను పరాగ్-అశ్విన్ (19 బంతుల్లో 28, 3 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 50 పరుగులు జోడించారు. పరాగ్ మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషించడంతో రాజస్థాన్ గౌరవప్రదమైన స్కోరుచేసింది. జురెల్ డకౌట్ అవగా పావెల్ (4), ఫెరీరా (7) విఫలమయ్యారు.
స్లో వికెట్పై పంజాబ్ బ్యాటర్లూ తడబడ్డారు. భారీ హిట్టర్లు కలిగిన పంజాబ్ ఇన్నింగ్స్ నత్తకు నడక నేర్పినట్టు సాగింది. బౌల్ట్ తొలి ఓవర్లోనే ప్రభ్సిమ్రన్ (6) వికెట్ కోల్పోయినా 5 ఫోర్లు కొట్టిన రూసో పంజాబ్ స్కోరు వేగాన్ని పెంచే యత్నం చేశాడు. కానీ అవేశ్ ఖాన్ ఒకే ఓవర్లో రూసో(13 బంతుల్లో 22, 5 ఫోర్లు), శశాంక్ (0)ను ఔట్ చేయగా బెయిర్ స్టో(14)ను చాహల్ పెవిలియన్కు పంపాడు. 5-11 ఓవర్ల మధ్య పంజాబ్ను రాయల్స్ బౌలర్లు కట్టడి చేయడంతో ఆ జట్టు 31 పరుగులే చేయగలిగింది. కానీ కెప్టెన్ కరన్, జితేశ్ శర్మ (22) పోరాటం పంజాబ్ను పోటీలోకి తెచ్చింది. ఆఖర్లో కాస్త ఉత్కంఠ రేగినా కరన్, అశుతోష్ (17 నాటౌట్) మెరుపులతో పంజాబ్ విజయాన్ని పూర్తిచేశారు.
రాజస్థాన్: 20 ఓవర్లలో 144/9 (పరాగ్ 48, అశ్విన్ 28, కరన్ 2/24, హర్షల్ 2/28).
పంజా బ్: 18.5 ఓవర్లలో 145/5 (కరన్ 63 నాటౌట్, రూసో 22, అవేశ్ 2/28, చాహల్ 2/31)