YS Jagan | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. జగన్ గురువారం విజయవాడ బెంజ్ సర్కిల్లోని ఐ ప్యాక్ కార్యాలయంలో టీం సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసినందుకు ఐ ప్యాక్ టీం సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీం సభ్యులతో మాట్లాడుతూ మరోసారి ఏపీలో అధికారంలోకి వస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
గతేడాదిన్నర కాలంగా ఐప్యాక్ టీం అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఎంపీ సీట్లు సైతం గతంలో కంటే ఎక్కువ వస్తాయని జగన్ స్పష్టం చేశారు. ఈ సారి ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందన్నారు. ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలనను అందించబోతున్నామని జగన్ స్పష్టం చేశారు. 2019లో వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు వస్తాయని ఎవరూ ఊహించలేదంటూ గుర్తు చేశారు. ప్రజలు సుపరిపాలనను చూసి ప్రజలు మద్దతు ఇస్తారన్నారు. ప్రశాంత్ కిశోర్ మనకు వ్యతిరేకంగా మారారని.. అతను కూడా ఊహించలేని సీట్లు వస్తాయన్నారు. ప్రశాంత్ కిశోర్ చేసేది ఏమీ లేదని.. అంతా ఐప్యాక్ టీం చేస్తుందని.. వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్ల ప్రజలకు ఇంకా మేలు చేద్దామన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందన్నారు.