కోల్కతా: టీ20 ప్రపంచకప్లో స్కాట్లాండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన గ్రూపు-సీ పోరులో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో ఇటలీపై ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్పై బహిష్కరణ వేటుతో ఆఖరి నిమిషంలో మెగాటోర్నీ బెర్తు దక్కించుకున్న స్కాట్లాండ్ ఎట్టకేలకు పాయింట్ల ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఓడిన స్కాట్లాండ్..మలి పోరులో అరంగేట్రం టీమ్ ఇటలీ భరతం పట్టింది.
తొలుత జార్జ్ మున్సె (54 బంతుల్లో 84, 13 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీకి తోడు బ్రెండన్ మెక్ముల్లెన్ (41 నాటౌట్), ఆఖర్లో మిచెల్ లీస్క్(5 బంతుల్లో 22 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించడంతో స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 207/4 స్కోరు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో కొత్తగా అడుగుపెట్టిన ఇటలీ పసలేని బౌలింగ్ను స్కాట్లాండ్ బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు.
లక్ష్యఛేదనకు దిగిన ఇటలీ.. లీస్క్(4/17) ధాటికి 16.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. బెన్ మనెటీ(52) అర్ధసెంచరీ మినహా పెద్దగా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించి లీస్క్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.