హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇప్పటికే పలు విప్లవాత్మక నిర్ణయాలతో యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తున్నక్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (సీఏటీ) తాజాగా పాఠశాల పిల్లల కోసం ప్రత్యేక క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసింది.
దిగ్గజ క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ మార్గదర్శకత్వంలో ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్(ఐఎస్బీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ఫౌండర్-సీఈవో సునీల్బాబు ప్రకటించారు. సోమవారం మీడియా సమావేశంలో ఐఎస్బీసీ జాతీయ కార్యవర్గంతో పాటు టోర్నీ విశేషాలను వెంగ్సర్కార్, సునీల్బాబు వివరించారు. ఈ సందర్భంగా వెంగ్సర్కార్ మాట్లాడుతూ ‘ముంబైలో పాఠశాల క్రికెట్ చాలా బలంగా ఉంది. ఈ కారణం వల్లే అక్కడి నుంచి జాతీయజట్టులోకి వస్తున్నారు.ఐఎస్బీసీ ఏర్పాటు చేస్తున్న సునీల్కు అభినందనలు’ అని అన్నారు.