Swiss Open : స్విస్ ఓపెన్లో 300 బ్యాడ్మింటన్ టైటిల్ సింగిల్స్లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. పీవీ సింధు, హెచ్ ఎస్ ప్రణయ్, కిదాంబీ శ్రీకాంత్ ఇంటిదారి పట్టారు. డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టీ మాత్రం అదరగొడుతున్నారు. వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. తైవాన్కు చెందిన ఫాంగ్ చిహ్ లీ – ఫాంగ్ జెన్ లీ జంటపై 12-21 21-17 28-26తో సాత్విక్ – చిరాగ్ విజయం సాధించారు. వీళ్లు సెమీస్ బెర్తు కోసం జెప్పే బే – లస్సే మొల్మెడే (డెన్మార్క్) జోడీతో తలపడనున్నారు.
మహిళల సింగిల్స్లో గత ఏడాది చాంపియన్ అయిన పీవీ సింధు నిరాశపరిచింది. రెండో రౌండ్లోనే ఆమె ఇంటిదారి పట్టింది. వరల్డ్ నంబర్ 9 సింధుకు ఇండేనేషియా అన్సీడెడ్ ప్లేయర్ పుత్రి కుసుమ వర్దానీ షాకిచ్చింది. 38వ ర్యాంకర్ వర్దానీ 15-21 21-12 18-21తో సింధుపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్లో భారత స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో అతడిని క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) ఓడించాడు. కిదాంబి శ్రీకాంత్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. హాంకాంగ్కు చెందిన చుయెక్ యూ లీ 22-20 21-17తో శ్రీకాంత్పై పై చేయి సాధించాడు.