Ricky Ponting : ఐపీఎల్ (IPL) పదహారో సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే.. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఫ్రాంఛైజీ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) సేవలను కోల్పోనుంది. గత ఏడాది కారు యాక్సిడెంట్లో గాయపడిన అతను ఇంకా కోలుకోలేదు. దాంతో, పంత్ మైదానంలోకి దిగకున్నా సరే.. అతడిని జట్టుతో కొనసాగించాలని హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) భావిస్తున్నాడు. ‘ఈ సీజన్లో ఢిల్లీ రిషభ్ పంత్ను మిస్ అవుతుంది. అతను ఢిల్లీ జట్టుకు ఆత్మ మాత్రమే కాదు హృదయం కూడా. అందుని పంత్ జెర్సీ నంబర్ 17ను ఆటగాళ్ల జెర్సీ, క్యాప్లపై ఉండేలా చూస్తాం.
దాంతో, పంత్ జట్టుతోనే ఉన్నాడనే భావన అందరిలో ఉంటుంది. మరొక విషయం ఏంటంటే..? ఇప్పటివరకు పంత్ స్థానంలో వికెట్ కీపింగ్ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. ప్రాక్టీస్ మ్యాచ్ల తర్వాత కీపర్ ఎవరనేది ప్రకటిస్తాం’ అని పాంటింగ్ తెలిపాడు. రంజీల్లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్ ఈసారి ఢిల్లీకి ఆడుతున్నాడు. అతడిని వికెట్ కీపర్గా సెలక్ట్ చేసే అవకాశం ఉంది.
పదహారో సీజన్ ఐపీఎల్లో ఢిల్లీని డేవిడ్ వార్నర్ నడిపించనున్నాడు. వార్నర్ కెప్టెన్సీలో సన్రైజర్స్ హైదరాబాద్ 2016లో చాంపియన్గా అవతరించింది. ఓపెనర్గా దంచి కొట్టే ఈ ఆస్ట్రేలియన్ ఢిల్లీకి కప్పు అందిస్తాడా? లేదా? అనేది ఆసక్తికరం. వార్నర్కు డిప్యూటీగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను నియమించారు. 14వ సీజన్లో ఢిల్లీ రన్నరప్గా నిలిచింది. ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పే పంత్ ఆడకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు.
ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగు సార్లు ట్రోఫీ విజేత చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ సరికొత్తగా ఉండనుంది. టాస్ తర్వాత తుది జట్టును ఎంచుకోవడం, ఇంప్యాక్ట్ ప్లేయర్ను ఆడించడం వంటివి ఈసారి ఐపీఎల్ ప్రత్యేకతలు. అంతేకాదు ప్రతి టీమ్ సొంతగ్రౌండ్లో ఏడు మ్యాచ్లు ఆడనుంది.