భువనగిరి అర్బన్: రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్..అద్భుత ప్రతిభ కనబరిచిన ప్లేయర్లకు భారీగా నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సీఎం కప్ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి ఆంజనేయగౌడ్ సరదాగా కబడ్డీ ఆడారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదుగాలనే లక్ష్యంతో 17వేల క్రీడా ప్రాంగణాలను సీఎం కేసీఆర్ నిర్మించారన్నారు. ఎమ్మెల్యే శేఖర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ నైపుణ్యాల నేలగా మారిపోయిందన్నారు.