Westindies Tour : వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)లో భారత జట్టు తొలి టెస్టుకు సిద్ధమవుతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final 2023) దారుణ ఓటమి నుంచి తేరుకునేందుకు ఈ సిరీస్ ఎంతో ఉపయోగపడనుంది. అంతేకాదు ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జట్టు ఎంపికలో కూడా ఈ సిరీస్ కీలకం కానుంది. ముఖ్యంగా సంజూ శాంసన్(Sanju Samson), ఇషాన్ కిషన్(Ishan kishan), ఉమ్రాన్ మాలిక్(Umran Malik).. ఈ ముగ్గురికి విండీస్ టూర్ పెద్ద పరీక్ష అనే చెప్పాలి.
ఎందుకంటే..? ఈ సిరీస్లో రాణిస్తేనే వీళ్లు వరల్డ్ కప్ జట్టులో ఉంటారు. ఒకవేళ విఫలమయ్యారనుకోండి.. ఇక అంతే సంగతి. అందుకని విండీస్ గడ్డపై తమ సత్తాను నిరూపించుకోవాలని శాంసన్, ఇషాన్, ఉమ్రాన్ తహతహలాడుతున్నారు.
బోలెడంత టాలెంట్, అద్భుతమైన ఫుట్వర్క్ సంజూ శాంసన్(Sanju Samson) సొంతం. ఉన్నచోటనే నిలబడి భారీ సిక్స్లు కొట్టగలడు కూడా. కానీ, ఇప్పటికీ జట్టులో సుస్థిర స్థానం సంపాదించలేకపోయాడు. అతడి తర్వాత వచ్చిన రిషభ్ పంత్(Rishabh Pant), ఇషాన్ కిషన్ అవకాశాల్ని అందిపుచ్చుకున్నారు. అయితే.. శాంసన్ మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.
16వ సీజన్లో దంచికొట్టిన శాంసన్
కానీ, 16వ సీజన్ ఐపీఎల్(IPL 2023)లో విధ్వసంక ఇన్నింగ్స్లు ఆడిన ఈ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కెప్టెన్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. బహుశా అతనికి ఇదే ఆఖరి అవకాశం కావొచ్చు. అందుకుని వికెట్ కీపర్, ఫినిషర్గా సత్తా చాటాలని శాంసన్ అనుకుంటున్నాడు.
మరోవైపు.. బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీ(Double Century)తో ఒక్కసారిగా హీరో అయిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత తేలిపోయాడు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్లో భారీ స్కోర్లు చేయలేకపోయాడు. అతడి ప్లేస్లో ఓపెనర్గా ఆడుతున్న శుభ్మన్ గిల్(Shubman Gill) అన్ని ఫార్మాట్లలో సెంచరీలతో రికార్డులు బద్ధలు కొడుతున్నాడు.
బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీ కొట్టిన ఇషాన్
దాంతో, ఓపెనింగ్లో ఇషాన్కు అతడి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వికెట్ కీపర్గా శ్రీకర్ భరత్(Srikar Bharat) ఆకట్టుకోవడంతో ఇషాన్ బెంచ్కే పరిమితం కావాల్సి వస్తోంది. అందుకని విండీస్ సిరీస్లో చెలరేగి ఆడాలని ఈ లెఫ్ట్ హ్యాండర్ పట్టుదలతో ఉన్నాడు.
స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్కు ఐపీఎల్లో మెరుగైన రికార్డు ఉంది. అయితే.. శ్రీలంక, న్యూజిలాండ్తో జరిగిన టీ20ల్లో మాత్రం అతను పెద్దగా ఆకట్టుకోలేదు. ఐపీఎల్ పదహారో సీజన్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. గంటలకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల ఉమ్రాన్ వికెట్లు తీయలేకపోతున్నాడు.
ఉమ్రాన్ మాలిక్
దాంతో, టెక్నిక్, లైన్ అండ్ లెంగ్త్పై దృష్టి పెట్టాడు. భవిష్యత్తులో అతడి సేవలు అవసరమని భావించిన సెలెక్టర్లు ఈ యంగ్ పేసర్కు విండీస్ సిరీస్లో మరో అవకాశం ఇచ్చారు. ఈసారి ఉమ్రాన్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. కరీబియన్ గడ్డపై భారత జట్టు రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 ఆడనుంది. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు బార్బడోస్లో జూలై 12న మొదల్వనుంది.