Dhoni & Kohli | మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ భారత క్రికెట్లో తమకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్న ప్లేయర్లు. ఆట కోసమే పుట్టారా అన్న రీతిలో తమ అద్భుత ఆటతీరుతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న వీరిద్దరూ ఆదాయ ఆర్జనలోనూ ఒకరికొకరు పోటీపడుతున్నారు. ఓవైపు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మహీ.. ఐపీఎల్లో కొనసాగుతుండగా, కోహ్లీ..టీమిండియాకు కీలక సేవలు అందిస్తున్నాడు. అయితే దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో ఈ ఇద్దరు క్రికెటర్లు ప్రముఖ బ్రాండ్లతో కలిసి కోట్లల్లో ఎండార్స్మెంట్లు చేసుకున్నారు. ఇలా ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యధికంగా సంపాదిస్తున్న వారి జాబితాలో విరాట్కోహ్లీ టాప్లో కొనసాగుతుండగా, ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో 252 మిలియన్ల మంది ఫాలోవర్లను కల్గిన కోహ్లీ.. సోషల్మీడియాలో టాప్ గేర్లో దూసుకెళుతున్నాడు. స్టాక్ గ్రో నివేదిక ప్రకారం కోహ్లీ ఆదాయం అక్షరాలా 1,050 కోట్లు. ఇందులో వార్షిక కాంట్రాక్టు కింద బీసీసీఐ నుంచి ఏడాదికి ఏడు కోట్లు వస్తుండగా, ఒక్కో టెస్టుకు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20 మ్యాచ్కు 3 లక్షల చొప్పున తన ఖాతాలో వేసుకున్నాడు. దీనికి అదనంగా ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఏడాదికి కోహ్లీకి రూ.15 కోట్లు చెల్లిస్తున్నది. మరోవైపు లేటు వయసులోనూ తనలో క్రికెట్ చేవ తగ్గలేదని నిరూపిస్తూ మహీ కోట్లు కొల్లగొడుతున్నాడు. ఐపీఎల్లో చెన్నై.. ధోనీకి 12 కోట్లు ఇస్తుండగా పలు కంపెనీల్లో పెట్టుబడులు, సోషల్మీడియా ఫీజులు, బ్రాండ్లు, రియల్ ఏస్టేట్ పెట్టుబడుల ద్వారా రూ.1040 కోట్లు ఆర్జిస్తున్నాడు. వీరిద్దరు పది కోట్ల తేడాతో నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోనీ ఆడేది అనుమానంగా మారగా, కోహ్లీకి ఐపీఎల్ టైటిల్ కలగానే మిగిలిపోయింది.