INDvsSA : దక్షిణాఫ్రికా గడ్డమీద భారత జట్టు 1992 నుంచి టెస్టు సిరీస్లు ఆడుతున్నా ఇప్పటివరకూ ఒక్క సిరీస్ కూడా గెలవకపోవడానికి గల కారణాలేంటనేదానిపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికాలో భారత్ సిరీస్ నెగ్గకపోవడానికి కారణం మెరుగైన క్రికెట్ ఆడలేక కాదని.. చాలా వరకూ సిరీస్లలో రెండు లేదా మూడు టెస్టులే ఉండేవని అలా కాకుండా ఎక్కువ మ్యాచ్లు ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని బంగర్ అన్నాడు.
తొలి టెస్టు ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో బంగర్ మాట్లాడుతూ… ‘సౌతాఫ్రికాలో భారత్ ఇప్పటిదాకా టెస్టు సిరీస్ గెలవకపోవడానికి ప్రధాన కారణం మనం ఎప్పుడూ రెండు లేదా మూడు మ్యాచ్ల సిరీస్లు మాత్రమే ఆడాం. అలా కాకుండా నాలుగు లేదా ఐదు మ్యాచ్ల సిరీస్లు ఉంటే కచ్చితంగా భారత్ మెరుగైన ఫలితాలు సాధించేది..’ అని అన్నాడు.
అయితే ఇన్నాళ్లూ దక్షిణాఫ్రికాలో సిరీస్ నెగ్గని భారత్.. ఈసారి మాత్రం గెలిచేందుకు మంచి అవకాశాలున్నాయని బంగర్ తెలిపాడు. సౌతాఫ్రికాలోని స్టేడియాలతో పోలిస్తే సెంచూరియన్లో పేస్కు తక్కువగా అనుకూలిస్తుందని.. ఇది టీమిండియాకు కలిసొచ్చేదని బంగర్ అన్నాడు. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం నుంచి తొలి టెస్టు జరగాల్సి ఉండగా రెండో టెస్టు 2024 జనవరి 04 నుంచి కేప్టౌన్ వేదికగా జరుగనుంది.