కబడ్డీ..ఈ గ్రామీణ క్రీడకు ఉన్న క్రేజే వేరు. దేశంలో క్రికెట్ తర్వాత అత్యంత అభిమానగణాన్ని పొందిన క్రీడగా కబడ్డీ వెలుగొందుతున్నది. గ్రామీణ స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన కబడ్డీలో మన తెలంగాణ వాసి, కబడ్డీలో అపార అనుభవమున్న శ్రీనివాస్..ఆసియాగేమ్స్ కోసం బంగ్లా జట్టుకు శిక్షణ అందిస్తున్నాడు. రానున్న ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్కు చీఫ్ కోచ్గా వ్యవహరించబోతున్నాడు. సంగారెడ్డి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన శ్రీనివాస్రెడ్డితో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ.
బంగ్లా కోచ్గా ఎలా ఎంపికయ్యారు?
ప్రపంచ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్లో బంగ్లాదేశ్ జట్టుకు కోచ్గా పనిచేశాను. అప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమం అన్నదగ్గ 12 జట్లు పోటీపడ్డాయి. ఇందులో బంగ్లా టీమ్ ఆరో స్థానంలో నిలిచింది. దీంతో సీనియర్ జట్టుకు కూడా నా సేవలు ఉపయోగించుకునేందుకు బంగ్లాదేశ్ కబడ్డీ అసోసియేషన్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా చైనా వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్ కోసం బంగ్లా కబడ్డీ జట్టుకు కోచ్గా సేవలందిస్తున్నాను. భారత్కే చెందిన రామ్ గోయత్తో కలిసి శిక్షణ ఇస్తున్నాం.
శిక్షణ ఎలా కొనసాగుతున్నది?
ఆసియా గేమ్స్ కోసం బంగ్లాదేశ్ సీనియర్ జట్టును తీర్చిదిద్దుతున్నాం. బంగ్లాదేశ్లో కబడ్డీ జాతీయక్రీడ. ఇక్కడి ప్రభుత్వం కబడ్డీకి మంచి ప్రాధాన్యమిస్తోంది. కబడ్డీ అసోసియేషన్ స్వయంగా డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నడుస్తున్నది. క్రీడా అసోసియేషన్లలో రాజకీయ నాయకుల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది. ఆసియాగేమ్స్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతీ రోజు శిక్షణతో పాటు మెంటల్ కండీషనింగ్, వీడియో సెషన్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాను. వీడియోల ద్వారా లోటుపాట్లు ఏంటో తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం.
ఆసియాగేమ్స్లో అవకాశాలు ఎలా ఉన్నాయి?
ఆసియాగేమ్స్లో బంగ్లాదేశ్ కచ్చితంగా టాప్-3లో నిలుస్తుందన్న నమ్మకం ఉంది. ప్రతిభ కల్గిన యువతతో పాటు అనుభవజ్ఞలైన ప్లేయర్లు ఉండటం బంగ్లా జట్టుకు కలిసొచ్చే అంశం. కబడ్డీ పవర్హౌజ్లుగా వెలుగొందుతున్న భారత్, ఇరాన్కు బంగ్లా దీటైన పోటీనిస్తుందన్న నమ్మకముంది.
కబడ్డీ కోచ్గా మీ ప్రస్థానం?
2014లో ఇంచియాన్ ఆసియా గేమ్స్లో కొరియా పురుషుల కబడ్డీ జట్టుకు తొలుత కోచ్గా వ్యవహరించాను. ఆ టోర్నీలో కొరియా కాంస్య పతకం దక్కించుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్కు సేవలందించాను. 2016లో స్వర్ణ పతకం గెలిచిన భారత జూనియర్ జట్టుకు కోచ్గా పనిచేశాను. 2018లో దుబాయ్ మాస్టర్స్ టోర్నీలో భారత సీనియర్ జట్టు పసిడి పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించాను. మొత్తంగా మూడు ఆసియా గేమ్స్ (2014, 18, 23)లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తుండటం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను.
పీకేఎల్లో మీ పాత్ర?
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో రానున్న సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాను. గత సీజన్కు భిన్నంగా ఈసారి జట్టును విజయపథంలో నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాను. గతంలోనూ జైపూర్ పింక్పాంథర్స్ జట్టుకు ప్రధాన కోచ్గా పనిచేసిన అనుభవముంది.
జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం?
2003 నుంచి 2005 వరకు భారత కబడ్డీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాను. ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో పాలుపంచుకున్నాను. స్పోర్ట్స్ కోటాలో ప్రస్తుతం యూనియన్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
కుటుంబనేపథ్యం ఏంటీ?
మాది సంగారెడ్డి జిల్లా ఉత్తర్పల్లి గ్రామం. తండ్రి ఆర్టీసీ ఉద్యోగి, తల్లి గృహిణి. భార్య రాధికారెడ్డి ప్రస్తుతం పీకేఎల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నది. కూతురు ఇంటర్ చదువుతున్నది.
భవిష్యత్ లక్ష్యాలు ఏంటీ?
కోచ్గా మరింత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే..కబడ్డీ కోచింగ్ ద్వారా మరింత మంది యువకులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. భారత సీనియర్ కబడ్డీ జట్టుకు చీఫ్ కోచ్గా పనిచేయాలన్నది నా కల. అందుకోసం నిర్విరామంగా కష్టపడుతున్నా.