దుబాయ్: టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో పెద్ద జట్లన్నీ బరిలో దిగి బలాబలాలు తేల్చుకుంటాయి. ఎంతోమంది మ్యాచ్ విన్నర్లు ఉన్న భారత జట్టు టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతోంది. అయితే మన జట్టులోని ఒక ప్రధాన బ్యాట్స్మెన్పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆ బ్యాట్స్మెన్కు మరింత మెచ్యూరిటీ అవసరమని అభిప్రాయపడ్డాడు. ఇంతకీ ఆ బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా? ఇటీవల ముగిసిన ఐపీఎల్లో తన జట్టును ప్లేఆఫ్స్ చేర్చిన రిషభ్ పంత్. అక్టోబరు 24న భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక యూట్యూబ్ ఛానెల్కు సల్మాన్ బట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ సందర్భంగా రిషభ్ పంత్ బ్యాటింగ్ను అంచనా వేయడం చాలా సులువని వివరించాడు. ఒకటి రెండు బంతుల తర్వాత లేదంటే తొలి బంతికే ముందుకొచ్చి ఆడటం పంత్కు అలవాటైపోయిందని, దీన్ని అంచనా వేయడం ప్రత్యర్థి జట్లకు సులభంగా మారిందని బట్ చెప్పాడు. ‘‘ఏం చెప్పగలం? అతని మూడ్ సడెన్గా మారిపోతుంది.
వెంటనే ముందుకు దూకి భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తాడు. అతను ఇలా మరీ ఎక్కువగా చేస్తున్నాడు. ఆ ఇప్పుడు అతను ముందుకు దూకుతాడు అని ప్రత్యర్థి జట్లు అనేంతలా అతనికి ఇది అలవాటైపోయింది’’ అని సల్మాన్ బట్ వివరించాడు. ఇలాంటి సమయంలో పంత్ మరింత పరిపక్వమైన ఆలోచనా విధానంతో బ్యాటింగ్ చేయాలని సూచించాడు.
పంత్ చాలా ట్యాలెంట్ ఉన్న ఆటగాడని మెచ్చుకున్న బట్.. ప్రస్తుతం అతని ఆటతీరును మాత్రం సులభంగా అంచనా వేసేయొచ్చని పేర్కొన్నాడు. ఈ మెగా టోర్నీలో పంత్ ఎలా ఆడతాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.