Sakshi Malik : భారత రెజ్జింగ్ సమాఖ్య రద్దుతో మొదలైన వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. సాక్షి మాలిక్(Sakshi Malik), భజ్రంగ్ పూనియా(Bajrang Punia), వినేవ్ ఫోగట్(Vinesh Phogat)కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్, హర్యానాకు చెందిన కొందరు జూనియర్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ నేపథ్యంలో రెజ్లింగ్కు వీడ్కోలు పలికిన సాక్షి .. మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
భూషణ్కు చెందిన గుండాలు కొందరు మా అమ్మను బెదిరిస్తున్నారని ఆమె మీడియా సమావేశంలో తెలిపింది. ‘గత రెండు మూడు రోజులుగా బ్రిజ్ భూషణ్ గుండాలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. మా అమ్మకు ఫోన్ చేసి వేధిస్తున్నారు. అంతేకాదు చాలామంది మా మా కుటుంబంలో ఒకరిపై కేసు పెట్టాలని అంటున్నారు. మా కుటుంబానికి, తోటి రెజ్లర్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని బుధవారం ఢిల్లీలో సాక్షి వెల్లడించింది.
భజ్రంగ్ పూనియా
రెజ్జింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ డిసెంబర్ 21న గెలుపొందాడు. అతడి విజయానికి నిరసనగా స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్(Sakshi Malik) కుస్తీని వదిలేసింది. మీడియా సమావేశంలో తన షూస్ను వదిలేస్తూ కన్నీటి పర్యంతమైంది. ఒలింపిక్ విజేత భజ్రంగ్ పూనియా(Bajran Punia) తన పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చేశాడు. మరో రెజ్లర్ వినేశ్ ఫోగట్ కూడా కర్తవ్య్ పథ్లో తన అవార్డులను వదిలేసింది.