IPL | ఢిల్లీ : ఐపీఎల్-18లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. క్యాపిటల్స్ నిర్దేశించిన 200 పరుగుల ఛేదనను టైటాన్స్ 19 ఓవర్లలోనే దంచేసింది. సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్, 12 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్, 3 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టు ఘనవిజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్, 14 ఫోర్లు, 4 సిక్సర్లు) ఐపీఎల్లో ఐదో శతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన రాహుల్.. టీ20లలో పరిస్థితులకు తగ్గట్టు ఇన్నింగ్స్ను ఎలా ఆడాలో చేతల్లో చూపించాడు. ఆరంభంలో రాహుల్ ఆట చూస్తే.. తొలి 18 బంతుల్లో అతడు చేసినవి 17 పరుగులే. ఆ తర్వాత కాస్త గేర్ మార్చినా.. పూర్తిస్థాయిలో జూలు విదిల్చలేదు. మూడో ఓవర్లోనే డుప్లెసిస్ (5) నిష్క్రమించడంతో రాహుల్ ఆచితూచి ఆడాడు. సిరాజ్ 5వ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన అతడు.. రబాడా 6వ ఓవర్లో 6, 4, 6తో పంథా మార్చాడు. పొరెల్ క్రీజులో నిలిచినా అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తయ్యాక రాహుల్ పూర్తిస్థాయిలో జోరు పెంచాడు. ఫిఫ్టీ నుంచి 90లలోకి రావడానికి రాహుల్ తీసుకున్న బంతులు 16 మాత్రమే. ప్రసిద్ధ్ 19వ ఓవర్లో 6, 4తో 60 బంతుల్లో ఈ ఢిల్లీ ఓపెనర్ శతకం పూర్తయింది. ఐపీఎల్లో అతడికి ఇది ఐదో సెంచరీ కాగా మూడు ఫ్రాంచైజీల (పంజాబ్, లక్నో, ఢిల్లీ) తరఫున ఆడుతూ శతకం సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే లక్ష్యం దిశగా సాగింది. అక్షర్ తొలి ఓవర్లోనే పది పరుగులు రాగా నటరాజన్ రెండో ఓవర్లో సుదర్శన్ నాలుగు బౌండరీలు దంచడంతో ఆ ఓవర్లో 20 రన్స్ వచ్చాయి. మరో ఎండ్లో గిల్.. కుదురుకునేదాకా కాస్త నెమ్మదిగా ఆడాడు. సుదర్శన్ కూడా జోరు తగ్గించినా రన్ రేట్ మాత్రం 7కు తగ్గకుండా చూసుకున్నాడు. అక్షర్ 9వ ఓవర్లో బౌండరీతో సుదర్శన్ అర్ధ శతకం పూర్తయింది. అదే ఓవర్లో సిక్సర్ బాదిన గిల్.. ఓవర్కు సిక్స్కు తగ్గకుండా బాదాడు. చమీర ఓవర్లో బౌండరీతో గిల్ కూడా ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరూ అర్ధ శతకాల తర్వాత బౌండరీలు, సిక్సర్ల మోత మోగించడంతో టైటాన్స్ లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా దంచేసింది. కుల్దీప్ 18వ ఓవర్లో సిక్సర్తో సాయి.. ఐపీఎల్లో రెండో శతకాన్ని నమోదుచేశాడు.
ఢిల్లీ: 20 ఓవర్లలో 199/3 (రాహుల్ 112*, పొరెల్ 30, అర్షద్ 1/7, ప్రసిద్ధ్ 1/40);
గుజరాత్: 19 ఓవర్లలో 205/0 (సాయి 108*, గిల్ 93*)