న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్ రంగంలోని ఉత్తమమైన కోచ్లలో ఒకరిగా దక్షిణాఫ్రికాకు చెందిన గారీ కిర్స్టెన్ గుర్తింపు పొందాడు. భారత క్రికెట్ జట్టు కోచ్గా ఆయన అద్భుతాలు సృష్టించాడు. ఆఖరికి 2011 క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టును విజయతీరాలకు చేర్చి చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. అయితే, ఆయన 2008లో భారత్ క్రికెట్ జట్టు కోచ్గా చేరినప్పుడు పరిస్థితులు అంత బాగా ఏమీ లేవు. ఎంఎస్ ధోని నాయకత్వంలో 2007లో ఇండియన్ టీమ్ టీ20 వరల్డ్కప్ గెలిచినప్పటికీ సచిన్ టెండూల్కర్ లాంటి ప్రసిద్ధ క్రికెటర్లు తీవ్ర విచారంలో ఉన్నారు. దాంతో జట్టు సభ్యులందిరీలో ఉత్తేజం నింపడం కిర్స్టెన్కు చాలా కఠినమైన టాస్క్గా మారింది.
భారత క్రికెట్ జట్టు కోచ్గా చేరినప్పుడు తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ‘ది ఫైనల్ వర్డ్ క్రికెట్’ అనే డిజిటల్ ప్లాట్ఫార్మ్లో పోస్ట్ చేసిన వీడియోలో కిరెస్టెన్ వివరించాడు. తీవ్ర విచారంలో ఉన్న సచిన్ టెండూల్కర్ను తిరిగి గాడిలోకి తేవడం తనకు అతిపెద్ద సవాల్గా మారిందని తెలిపాడు. ‘మంచి ప్రతిభ కలిగిన జట్టును వరల్డ్ బీటింగ్ టీమ్గా మార్చేందుకు ఏం చేయాలని ఆలోచించాను. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ కోచ్కైనా అది చిక్కుప్రశ్నే. జట్టు సభ్యులందరి మనసులో ఏముందో విడివిడిగా తెలుసుకుని, వాళ్లు జట్టుకు ఎలా ఉపయోగపడుతారో గుర్తించి, అందుకు అనుగుణంగా వాళ్లలో విచారం పొగొట్టి, ఆటను ఆస్వాదిస్తూ ఆడేలా చేయాలని నేను నిర్ణయించుకున్నా’ అని కిర్స్టెన్ పేర్కొన్నాడు.
‘నేను జట్టు కోచ్గా చేరిన సమయంలో సచిన్ టెండూల్కర్ తీవ్ర విచారంలో ఉన్నాడు. దాంతో ఆటను సరిగా ఆస్వాదించలేకపోతున్నాడు. తనకు ఎన్నో అవకాశాలు వస్తున్నప్పటికీ తాను సరిగా ఆడలేకపోతున్నాననే భావనలో సచిన్ ఉన్నాడు. బహుశా తనకు రిటైర్మెంట్ దగ్గర పడిందన్న ఆలోచనలో కూడా అతను ఉండి ఉంటాడు. ఆ సమయంలో అతనితో మాట్లాడి సమస్య పరిష్కరించడం తనకు చాలా ముఖ్యమనిపించింది. అందుకే జట్టుకు అతని సేవలు ఎంత అమూల్యమైనవో, జట్టు కోసం అతను అవసరానికి మించి చేయాల్సింది ఏమిటో చెప్పాను’ అని మాజీ కోచ్ కిర్స్టెన్ వివరించాడు. అదేవిధంగా నాటి కెప్టెన్ ఎంఎస్ ధోనీకి, తనకు మధ్య కుదిరిన కెమిస్ట్రీ గురించి కూడా కిర్స్టెన్ ఆ వీడియోలో వెల్లడించాడు.