బీజేపీపై 11,703 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపు
రెండో ప్రాధాన్యత ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం
మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ ఆధిక్యత సాధించిన టీఆర్ఎస్
టీఆర్ఎస్కు 1,49,269 ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థికి 1,37,566 ఓట్లు
సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ
రాంచందర్రావుకు షాకిచ్చిన పట్టభద్రులు
ఫలించిన ట్రబుల్ షూటర్ వ్యూహం
ముందుండి నడిపించిన మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి
రంగారెడ్డి, మార్చి 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గ పట్టభద్రులు టీఆర్ఎస్కే జై కొట్టారు. మంత్రులు హరీశ్రావు, సబితారెడ్డి వ్యూహం ఫలించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతి పట్టభద్రుడిని కలువడం.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించడం కలిసొచ్చింది. ఇక కేంద్రం ప్రజలపై మోపిన భారాన్ని, బీజేపీ నేతల అబద్దపు ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో టీఆర్ఎస్ శ్రేణులు సఫలమయ్యారు. సీఎం కేసీఆర్ పాలనకు ఓటర్లు బ్రహ్మరథం పట్టడంతో వాణీదేవి బీజేపీ అభ్యర్థి రామచందర్రావుపై ఘన విజయం సాధించారు. అన్ని రౌండ్లలో ఆధిక్యం కనబర్చిన ఆమె భారీ మెజార్టీని దక్కించు కున్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గ పట్టభద్రులు టీఆర్ఎస్కు పట్టంకట్టారు. 41,639 ఓట్ల భారీ ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుపై ఘన విజయం సాధించారు. రాష్ట్రం ఏర్పాటైన ఏడేండ్లలోనే 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు మరిన్ని ఉద్యోగాల ఖాళీల భర్తీకి నిర్ణయించడం, దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అధిక మొత్తంలో వేతనాలు అందిస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్వైపే మెజార్టీ పట్టభద్రులు నిలిచారు. అదేవిధంగా అవాస్తవాలను ప్రచారాస్ర్తాలుగా చేసుకున్న బీజేపీకి పట్టభద్రులు తమ ఓటుతో బుద్దిచెప్పారు. పెట్రోలు, వంటగ్యాస్, వంట నూనె ధరలను భారీగా పెంచడంతోపాటు దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీపై తప్పుడు వివరాలివ్వడం, రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేసిన బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. మరోవైపు ఉద్యోగులకు పీఆర్సీ, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలతో మొదటి ప్రాధాన్యతతోపాటు రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా టీఆర్ఎస్కే ఎక్కువగా పడ్డాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్రావు వ్యూహం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఫలించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు అప్పజెప్పన రోజు నుంచి హరీష్రావు ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, ఇన్చార్జిలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు ఉన్న రంగారెడ్డి జిల్లానే కీలకం కావడంతో ఇన్చార్జి మంత్రి హరీశ్రావు, జిల్లా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ముందుండి నడిపించారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుంబి మోగించడంపై జిల్లా అంతటా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.
41,639 ఓట్ల మెజార్టీ..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణిదేవి ఆధిక్యత ప్రదర్శించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్కు మెజార్టీ లభించింది. అయితే ఏ రౌండులోనూ మిగతా అభ్యర్థులు ఆధిక్యత ప్రదర్శించలేకపోయారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి అధికారులు ఫలితాలను ప్రకటించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల నుంచి ఎలిమినేషన్ చేస్తూ వారికి రెండో ప్రాధాన్యతగా వచ్చిన ఓట్లను ప్రధాన అభ్యర్థులకు కలుపుతూ రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లతో తమకు మెజార్టీ వస్తుందని ఆశించిన బీజేపీ ఆశలను పట్టభద్రులు ఆవిరి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డితోపాటు స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్కు రెండో ప్రాధాన్యత ఓట్లలో అత్యధిక ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికే వేయడం గమనార్హం. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థికి వేసిన రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థికే అధికంగా వేయడంతో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి భారీ ఆధిక్యత సాధించింది. అయితే 3,58,148 ఓట్లు పోల్కాగా 21,309 ఓట్లను చెల్లని ఓట్లుగా గుర్తించగా, 3,37,039 ఓట్లను చెల్లుబాటయ్యే ఓట్లుగా ఎన్నికల అధికారులు తేల్చారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఏ పార్టీకి మెజారిటీ లభించలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో టీఆర్ఎస్కు 1,12,689 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 1,04,668 ఓట్లు వచ్చాయి. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి 76,650 ఓట్లు వచ్చాయి. దీంతో మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి మొత్తం మ్యాజిక్ ఫిగర్ను దాటి 1,89,339 ఓట్లతో ఘన విజయం సాధించారు.
నాలుగు రోజులపాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నాలుగు రోజులపాటు జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కోసం నాలుగు రోజులు నిరీక్షించక తప్పలేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభంకాగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. తదనంతరం బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున బండీళ్లుగా కట్టారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేందుకు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 7 టేబుళ్లను ఏర్పాటు చేశారు. బండిల్గా కట్టే ప్రక్రియ పూర్తేయ్యందుకు 12 గంటల సమయం పట్టింది. బుధవారం రాత్రి 10 గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయింది. అయితే ఒక్కో రౌండ్లో 56 వేల ఓట్లను లెక్కించేందుకు 6 గంటల సమయం తీసుకుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను క్రమంగా ఎలిమినేషన్ చేస్తూ వచ్చారు. 92 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసేందుకుగాను శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్విరామంగా కొనసాగడంతో విడుతల వారీగా సిబ్బంది విధులు నిర్వర్తించారు.
ఫలించిన ట్రబుల్ షూటర్ వ్యూహం…
ఎన్నికలేవైనా గెలుపు మనవైపే ఉండాలనే విధంగా టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరొందిన రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు పక్కా వ్యూహాలు రచిస్తారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, లెక్చరర్లు సంఘాలతోపాటు ప్రైవేట్ ఉపాధ్యాయ, లెక్చరర్లు, నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్కరితో విడివిడిగా సమావేశాలను నిర్వహించి టీఆర్ఎస్ పార్టీ సబ్బండ వర్ణాల సంక్షేమానికి అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగుల సమస్యలను పరిష్కారం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని పట్టభద్రులకు తెలియజేశారు. అదేవిధంగా 50 ఓటర్లకు ఒక్క ఇన్చార్జిని కూడా నియమించి పోలింగ్ రోజు వరకు సంబంధిత ఇన్చార్జిలతో సమావేశమై గెలుపు బాట నడిపించేందుకు దిశానిర్దేశం చేశారు. జిల్లా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, ఇన్చార్జి మంత్రి హరీశ్రావుతో కలిసి జిల్లాలో మెజార్టీ ఓట్లు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పడడంలో ముందుండి నడిపించారు. ప్రచారం అన్ని రోజులు ఇద్దరు మంత్రులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రజాప్రతినిధులను, శ్రేణులకు దిశానిర్దేశం చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంలో హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారు.