దేశంలో గ్రామీణ క్రీడలు కార్పొరేట్ కలను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే కబడ్డీ కొత్త హంగులతో అదరగొడుతుండగా, వాలీబాల్ నూతన ఒరవడితో ముందుకొచ్చింది. ఇప్పటికీ పల్లెల్లో యువకుల అభిమాన క్రీడగా వెలుగొందుతున్న వాలీబాల్ తాజాగా కార్పొరేట్ హంగులు అద్దుకుంది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ పేరిట వివిధ నగరాల సమాహారంతో ఏర్పాటై ఫ్యాన్స్కు ఫుల్జోష్ అందిస్తున్నది. తొలి సీజన్కు మించి మలి సీజన్లో టీవీ వీక్షణలో రికార్డులు తిరుగరాస్తున్నది. హైదరాబాద్ వేదికగా ఈ మధ్యే ముగిసిన పీవీఎల్ మ్యాచ్లు నగరవాసులను అలరించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బ్లాక్హాక్స్ యజమాని కంకణాల అభిషేక్రెడ్డి నమస్తే తెలంగాణతో మాట్లాడారు. లీగ్కు వస్తున్న ఆదరణ, వరల్డ్ వాలీబాల్ క్లబ్ లీగ్, మంత్రి కేటీఆర్ మద్దతు తదితర అంశాలను ఆయన పంచుకున్నారు.
గత సీజన్తో పోల్చి చూస్తే ఈసారి వాలీబాల్ లీగ్కు అభిమానుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తున్నది. కరోనా వైరస్ నిబంధనలతో తొలి సీజన్ ఆంక్షల మధ్య జరుగగా, ఈసారి స్టేడియంలో ఫ్యాన్స్ రాకతో కొత్త కలను సంతరించుకుంది. బెంగళూరుతో పాటు హైదరాబాద్లో జరిగిన పీవీఎల్ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబరిచారు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్లు ఫ్యాన్స్ను అలరించాయి. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరు అభిమానుల్లో ఫుల్జోష్ నింపింది. టిక్కెట్ ధరకు పూర్తి న్యాయం జరిగిందని భావిస్తున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా వాలీబాల్ మ్యాచ్ను దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో టీవీల్లో 133 మిలియన్ల మంది వీక్షించడం జరిగింది. క్రికెట్ను అమితంగా ఇష్టపడే భారత్లో వాలీబాల్కు ఉన్న క్రేజ్ ఏంటో తెలిసేలా చేసింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వీక్షణను పీవీఎల్ సొంతం చేసుకుంది.
ఏ లీగ్కైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది కీలకం. మేము దాన్ని బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఎంతసేపు ఆటవైపే గాకుండా సినీ, స్పోర్ట్స్ స్టార్ల ప్రభావం లీగ్కు అదనపు ఆకర్షణ తీసుకొస్తుంది. అందుకే మన టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండకు వాలీబాల్పై ఉన్న అభిరుచితో లీగ్తో మమేకమయ్యాడు. అతని రాకతో లీగ్ కొత్త కలను సంతరించుకుంది. దీనికి తోడు ప్రతిభ కల్గిన ప్లేయర్లకు ప్రోత్సాహం అందిస్తూ లీగ్కు రూపకల్పన చేశాం. స్వదేశీ ప్లేయర్లకు తోడు వివిధ దేశాల్లో లీగ్స్ ఆడుతున్న ప్లేయర్లు పీవీఎల్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లతో ఆడే అవకాశం మనవాళ్లకు దక్కింది.
వాలీబాల్ అభివృద్ధికి మేము క్లియర్ విజన్తో ఉన్నాం. ముఖ్యంగా గ్రామీణ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో టోర్నీలు నిర్వహించడం ద్వారా ప్రతిభ కల్గిన ప్లేయర్లను గుర్తిస్తాం. వారిని లీగ్కు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం. ఇందుకోసం వయసు విభాగాల వారీగా టోర్నీల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ర్టాల నుంచి ప్లేయర్ల ఎంపికపై దృష్టి సారించాం. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయి వసతులతో హైదరాబాద్ వేదికగా వాలీబాల్ అకాడమీ నెలకొల్పాలన్న ప్రణాళికతో ఉన్నాం. ప్రపంచ స్థాయిలో రాణించేందుకు టెక్నికల్ స్కిల్స్ మరింత అవసరం. ఇందుకు అంతర్జాతీయ కోచ్లు మాత్రమే కాదు వేర్వేరు దేశాల్లో ఆడటం వలన ప్లేయర్లు మరింత రాటుదేలుతారు.
గత సీజన్తో పోలిస్తే ఈసారి హైదరాబాద్ బ్లాక్హాక్స్లో యువకులకు పెద్దపీట వేశాం. మిగతా జట్లతో పోలిస్తే హైదరాబాద్ టీమ్ ప్లేయర్ల సగటు వయసు 22 మాత్రమే. యువ ప్లేయర్లను సానబెడుతూ భవిష్యత్ స్టార్లుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఉన్నాం. వాస్తవంగా ఈసారి జట్టుకు పంజాబ్కు చెందిన రంజిత్సింగ్ కెప్టెన్గా ఉండాల్సింది. కానీ పంజాబ్ పోలీస్ అకాడమీలో శిక్షణ వల్ల అతను రాలేకపోయాడు. రంజిత్కు తోడు ఔట్సైడ్ హిట్టర్ అజ్మత్..లీగ్కు ముందు చేతి వేలి గాయంతో లీగ్కు దూరమయ్యాడు.
వాలీబాల్ నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు అన్ని రకాలుగా మద్దతు లభించింది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ మా వెన్నంటి నిలిచారు. అలాంటి అద్భుత విజన్ ఉన్న లీడర్ ఉండ టం మన అదృష్టం. వాలీబాల్ క్లబ్ వరల్డ్కప్ హైదరాబాద్లో నిర్వహించేలా ప్లాన్ చేసుకో వాలని ఆయన సూచించారు. ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న ప్రతిష్ఠాత్మక లీగ్కు భారత్ తొలిసారి ఆతిథ్యమివ్వబోతున్నది. హైదరాబాద్లో వాలీబాల్ మ్యాచ్లు జరిగినన్ని రోజులు ప్రభుత్వం నుంచి పూర్తి సపోర్టు దక్కింది. ఇందుకు మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.