ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్ జయదవ్ ఉనద్కత్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో చాలా మంది కొవిడ్ బాధితులు ఆక్సిజన్, పలు ఔషధాల కొరత వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాపై పోరులో భాగంగా తన వంతు సాయంగా ఐపీఎల్లో తన జీతంలో 10శాతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.
‘విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్నవారికి అవసరమైన వైద్య వనరులను అందించడానికి నా ఐపీఎల్ జీతంలో 10శాతాన్ని సాయంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. కొవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు ఈ విరాళాన్ని నా కుటుంబసభ్యులు అందిస్తారని’ ఉనద్కత్ ట్వీట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్.. తమ ఉదారతను చాటుకుంది. దేశంలో కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు రాజస్థాన్ ఫ్రాంఛైజీ రూ.7.5 కోట్లను విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.