ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో బెంగళూరు సత్తాచాటింది. డుప్లెసిస్, మ్యాక్స్వెల్ అర్ధశతకాలకు అనూజ్ రావత్ మెరుపులు తోడవడంతో మంచి స్కోరు చేసిన ఆర్సీబీ.. ఆనక తమ బౌలింగ్తో రాజస్థాన్ను బెంబేలెత్తించింది. బెంగళూరు బౌలర్ల ధాటికి 59 పరుగులకే కుప్పకూలిన రాజస్థాన్ ఏడో పరాజయం మూటగట్టుకుంది.
జైపూర్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాయ ల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 16వ సీజన్లో ఆరో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన పోరులో బెంగళూరు 112 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (44 బంతుల్లో 55; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (33 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు నమోదు చేసుకోగా.. ఆఖర్లో అనూజ్ రావత్ (11 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.
రాజస్థాన్ బౌలర్లలో ఆడమ్ జంపా, ఆసిఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో రాయల్స్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్లో రాయల్స్కు ఇది రెండో అత్యల్ప స్కోరు. హెట్మైర్ (19 బంతుల్లో 35; ఒక ఫోర్, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా.. యశస్వి జైస్వాల్ (0), జోస్ బట్లర్ (0), కెప్టెన్ సంజూ శాంసన్ (4), జో రూట్ (10), దేవదత్ పడిక్కల్ (4), ధ్రువ్ జురెల్ (1), అశ్విన్ (0) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో పార్నెల్ మూడు, బ్రాస్వెల్, కరణ్ శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. పార్నెల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా సోమవారం జరుగనున్న పోరులో గుజరాత్ టైటాన్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 171/5 (డుప్లెసిస్ 55, మ్యాక్స్వెల్ 54; జంపా 2/25),
రాజస్థాన్: 10.3 ఓవర్లలో 59 ఆలౌట్ (హెట్మైర్ 35; పార్నెల్ 3/10).