Rohit Sharma : వన్డే వరల్డ్ కప్(ICC ODI WC 2023) షెడ్యూల్ విడుదల అవడమే ఆలస్యం.. ఫేవరెట్లు ఎవరు? సెమీస్ చేరే జట్లు ఏవి? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈసమయంలో…వరల్డ్ కప్ టోర్నీపై భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈసారి వరల్డ్ కప్ మామూలుగా ఉండదని, తగ్గపోరు ఖాయమని అన్నాడు. ‘సొంత గడ్డపై వరల్డ్ కప్ ఆడడం కచ్చితం గొప్ప అనుభవం. భారత జట్టు 12 ఏళ్ల క్రితం ఇక్కడే విశ్వ విజేతగా అవతరించింది.
దాంతో, ఈసారి మాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీమిండియాను మైదానంలో చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈసారి వరల్డ్ కప్ మామూలుగా ఉండదు. ప్రతి మ్యాచ్లో తగ్గ పోరు ఖాయం. ఎందుకంటే..? గతంలో కంటే ఇప్పుడు ఆట మారిపోయింది. ప్రతి జట్టు సానుకూల దృక్ఫథంతో బరిలోకి దిగనుంది. దాంతో, ఈ ఏడాది అభిమానులు చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్ చూస్తారు’ అని రోహిత్ తెలిపాడు.
GET YOUR CALENDARS READY! 🗓️🏆
The ICC Men’s @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/dakTklwcYe
— ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023
అంతేకాదు ఈ మెగా టోర్నీ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతామని, అక్టోబర్ – నవంబర్లో తమ అత్యుత్తమ ఆటను కనబరుస్తామని హిట్మ్యాన్ అన్నాడు. ప్రస్తుతం రోహిత్ బృందం వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమవుతోంది. అక్కడ రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ ఆడనుంది.
2011లో సొంతగడ్డపై వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టు
ఈ ఏడాది అక్టోబర్ 5న వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నవంబర్ 19న విజేత ఎవరో తేలిపోనుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే..? ఫైనల్తో పాటు సెమీ ఫైనల్ మ్యాచ్లకు కూడా ఐసీసీ రిజర్వ్ డేను కేటాయించింది. వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్లో 2019 ఫైనల్ చేరిన న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్లు అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న ఢీ కొంటాయి. ఈసారి టీమిండియా అత్యధికంగా 9 లీగ్ మ్యాచ్లు ఆడనుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన భారత్ ఈసారి ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. భారత జట్టు ఐసీసీ ట్రోఫీ సాధించి నేటికి 10 ఏళ్లు. 2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది.