ODI World Cup | ప్రపంచకప్లో భారత జట్టు వరుస విజయాలతో సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో బుధవారం తలపడనున్నది. ఈ మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా జట్టు వాతావరణం, బౌలింగ్ తదితర అంశాలపై స్పందించాడు. మొదట అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘మొదటి మ్యాచ్ నుంచి చివరి మ్యాక్ వరకు ప్రపంచకప్ ఆడిన సమయంలో ఒత్తిడి ఉంటుంది. కానీ, జట్టు ఒత్తిడిని ఎదుర్కొన్న విధానం అభినందనీయం’ అని పేర్కొన్నారు. ఆరో బౌలర్ ఎంపికపై స్పందిస్తూ ‘హార్దిక్ గాయపడ్డ వెంటనే మా కలయిక మారిపోయింది. మొదటి మ్యాచ్ నుంచి ఇతర ఆటగాళ్లను బౌలింగ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాం. ముందస్తుగా ఒకరిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం’ తెలిపాడు.
జట్టు అనుభవంపై మాట్లాడుతూ.. ‘ఈ జట్టులోని ఆటగాళ్లెవరూ 1983లో భారత్ తొలిసారిగా ప్రపంచకప్ గెలిచినప్పుడు పుట్టలేదు. 2011లో గెలిచిన సమయంలో సగం మంది ఆడలేదు. గతంలో వరల్డ్ కప్లను మనం ఎలా గెలుచుకున్నాం అనే దాని గురించి వారు మాట్లాడుకోవడం నాకు కనిపించలేదు. మనం ఎలా మెరుగ్గా ఉండగలం.. ఎలా మెరుగుపడగలం అనేదానిపై దృష్టి ఉంది. మొదట మ్యాచ్ నుంచి దృష్టి గెలవడంపైనే ఉంది. ఒకరిద్దరు ఆటగాళ్లతో ఏం చేయలేం. సహాయక సిబ్బందితో సహా అందరూ సహకరించారు. మేం రహస్యంగా ఫ్యాషన్ షో నిర్వహించాం. అదృష్టవశాత్తు ఎవరికీ తెలియదు. మొదటి నుంచి జట్టు వాతావరణం చాలా బాగుంది. జట్టు వాతావరణం బాగుండేందుకు ప్రతీది చేశాం’ అని రోహిత్ పేర్కొన్నాడు.
రేపు జరుగబోయే మ్యాచ్కు సంబంధించి టాస్పై స్పందిస్తూ ‘నేను ఇక్కడ చాలా క్రికెట్ ఆడాను. గత నాలుగైదు మ్యాచ్లలో వాంఖడే అంటే ఏంటో నాకు తెలియదు. కాబట్టి టాస్పై పట్టింపు లేదు’ అని తెలిపాడు. ప్రత్యర్థి న్యూజిలాండ్ గురించి మాట్లాడుతూ.. ‘అత్యంత క్రమశిక్షణ కలిగిన జట్టు. ఆ జట్టు తెలివిగా క్రికెట్ ఆడుతుంది. వారు తమ ప్రత్యర్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటారు. మనమూ అర్థం చేసుకుంటాం. ఆ జట్టు బలాబలాలు ఏంటో.. వారి ఆట ఎలా ఉంటుందో మేం అర్థం చేసుకున్నాం’ అని రోహిత్ వివరించాడు.