Rohit Sharma : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన రికార్డు నెలకొల్పాడు. కేప్టౌన్లోని న్యూలాండ్స్(New Lands)లో ఆసియా జట్ల సారథులు భంగపడిన చోట హిట్మ్యాన్ విజయ ఢంకా మోగించాడు. దాంతో, న్యూలాండ్స్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రోహిత్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ పిచ్ రేటింగ్స్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపట్టాడు. ఐసీసీ ఇకనైనా ద్వంద్వ వైఖరిని మానుకోవాలని సూచించాడు.
టెస్ట్ సిరీస్ ట్రోఫీతో రోహిత్, ఎల్గర్
‘ఈ మ్యాచ్లో ఏం జరిగిందో చూశాం. పిచ్ ఎలా ప్రవర్తించిందో గమనించాం. అయితే.. కేప్టౌన్ లాంటి పిచ్ల గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదు. కానీ, భారత పిచ్లపై పదే పదే నోరు పారేసుకోవద్దని ఐసీసీని కోరుతున్నా. మేము ఇక్కడికి వచ్చిందే సవాళ్లను ఎదుర్కోవడానికి. భారత పర్యటనకు వచ్చే జట్లకు కూడా అక్కడ అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అందుకని పిచ్లకు రేటింగ్స్ ఇచ్చేటప్పుడు మ్యాచ్ రిఫరీలు నిజాయతీగా వ్యవహరించాలి’ అని రోహిత్ పరోక్షంగా ఐసీసీ ద్వంద్వ వైఖరిపై విమర్శలు గుప్పించాడు.
కేప్టౌన్లో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. పేసర్లు బుమ్రా, సిరాజ్ నిప్పులు చెరగడంతో రెండు రోజుల్లోనే టీమిండియా మ్యాచ్ను ముగించింది. దాంతో, సఫారీ జట్టు బ్యాటింగ్ కోచ్ అష్వెల్ ప్రిన్స్(Ashwell Prince) పిచ్ను తప్పుపట్టాడు.
వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన వాంఖడే పిచ్
అయితే.. ఐసీసీ రిఫరీలు మాత్రం మౌనంగా ఉండిపోయారు. కానీ, వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) సెమీ ఫైనల్, ఫైనల్ జరిగిన ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖడే పిచ్లపై రిఫరీలు నానా రచ్చ చేసింది. ఈ రెండింటిని సాధారణ పిచ్లుగా పేర్కొంది. అంతేకాదు నిరుడు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఇండోర్ పిచ్కు కూడా ఐసీసీ చెత్త రేటింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.