Guntur Kaaram | సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా కూడా మహేశ్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారంపై ఉన్న అంచనాలు వేరు. ఎందుకంటే మిగిలిన సినిమాలు అన్నీ కలిసి చేసే బిజినెస్ కంటే.. ఒక్క గుంటూరు కారం మాత్రమే డబుల్ బిజినెస్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో ఆ రేంజ్ మరింత పెరిగింది. అతడు, ఖలేజా లాంటి కల్ట్ సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం. అన్నింటికి మించి దాదాపు 20 ఏళ్ల తర్వాత మహేశ్ బాబు మళ్లీ ఫుల్ మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు.
17 సంవత్సరాల తర్వాత స్మోకింగ్ సీన్స్ ఈ సినిమాలోనే చేశాడు. అతిథి తర్వాత ఈయన స్మోకింగ్ సీన్స్ ఏ సినిమాలో చేయలేదు. కానీ మళ్లీ గుంటూరు కారం కోసమే బీడీ ముట్టుకున్నాడు మహేశ్ బాబు. దానికి తోడు సినిమాలో మహేశ్ బాబు క్యారెక్టర్ కూడా ఫుల్ కమర్షియల్ మాస్ మసాలాగా ఉంటుందని.. కొన్ని సంవత్సరాలుగా సూపర్ స్టార్ అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాగే త్రివిక్రమ్ చూపించాడు అంటున్నారు. అన్నింటికి మించి సెన్సార్ సభ్యుల నుంచి కూడా ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చిందని తెలుస్తుంది. కథ రొటీన్ గానే ఉన్న సంక్రాంతికి ఏమేం కావాలో అని మిక్స్ చేసే తీసుకొస్తున్నాడు మాటల మాంత్రికుడు.
ముఖ్యంగా ఫస్టాఫ్లో వచ్చే ఎంటర్టైన్మెంట్ సినిమాకు ప్లస్ అవుతుందని టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. ఇక రెండు ఫైట్ సీన్స్.. అందులో వచ్చే సూపర్ స్టార్ కృష్ణ రిఫెరెన్స్.. మిర్చి యార్డ్లో శ్రీలీల, మహేశ్ బాబుపై షూట్ చేసిన నాదీ నక్కిలీసు గొలుసు పాట హైలైట్స్ అంటున్నారు. ఇక సెకండాఫ్ కూడా తక్కువేం చేయలేదు.. అభిమానులు కోరుకునే యాక్షన్ సీన్స్ లు ఉన్నాయని.. దానికి తోడు రమ్యకృష్ణ, మహేశ్ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కవుట్ అవుతాయంటున్నారు. సినిమాలో పొలిటికల్ పంచులు బాగా పేలతాయని.. అదే మేజర్ ట్విస్ట్ అంటున్నారు. ఇక ముందు నుంచి నిర్మాత నాగ వంశీ చెప్పినట్లు చివరి 45 నిమిషాలు సినిమాకు ఆయువు పట్టు అంటున్నారు.
సాధారణంగా క్లైమాక్స్లో భారీ ఫైట్ సీక్వెన్స్ ఉండాలి అనుకునే దర్శకుడు కాదు త్రివిక్రమ్. ఆయన గత సినిమాలు చూస్తే ఇది అర్థమవుతుంది. యాక్షన్ కంటే ఎక్కువగా ఎమోషన్ పై ఫోకస్ చేస్తుంటాడు ఈయన. అల వైకుంఠపురములో, అత్తారింటికి దారేది స్థాయిలోనే గుంటూరు కారంలోనూ ఎమోషనల్ క్లైమాక్స్ను ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.