Virat Kohli : పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచ కప్(ODI WC 2023) కోసం భారత జట్టు భారీగా కసరత్తులు చేస్తోంది. మెగాటోర్నీకి ముందు ఆసియా కప్(Asia cup 2023)లో టీమ్ఇండియా తమ బలగాన్ని పరీక్షించనుంది. ఈ నెల చివర్లో జరగనున్న ఆసియా కప్ (వన్డే ఫార్మాట్) కోసం సెలెక్షన్ కమిటీ సోమవారం జట్టును ప్రకటించింది. అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ(Eohit Sharma), చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ(Virat Kohli)తో పాటు తాను కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని హిట్మ్యాన్ వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కూడా అతడికి వంత పాడాడు. ‘కోహ్లీ, రోహిత్లను బౌలింగ్ చేసేందుకు ఒప్పిస్తామ’ని అన్నాడు.
💬 “Hopefully Sharma and Kohli can roll some arm over in the World Cup” 😃#TeamIndia captain Rohit Sharma at his inimitable best! 👌#AsiaCup2023 | @imRo45 pic.twitter.com/v1KKvOLcnq
— BCCI (@BCCI) August 21, 2023
గతంలో అడపాదడపా బౌలింగ్ చేసిన ఈ ఇద్దరూ కొంతకాలంగా బ్యాటింగ్పైనే దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో బౌలింగ్ చేయగల బ్యాటర్లు రాత్రికి రాత్రే పుట్టుకురారని, వాళ్లను మెల్లిగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుందని రోహిత్ అన్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
ఆసియా కప్ స్క్వాడ్లో అందరూ ఊహించినట్లే.. తెలుగు కుర్రాడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ(Tilak Varma)కు చోటు దక్కింది. శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. కేఎల్ రాహుల్ మరికొన్ని రోజుల్లో పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని, అందుకే బ్యాకప్గా సంజూ శాంసన్(Sanju Samson)ను ఎంపిక చేశామని అగార్కర్ ప్రకటించాడు. ఆగస్టు 30న ఆసియా కప్ మొదలవ్వనుంది. హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఈ ట్రోఫీకి భారత్, పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి ట్రోఫీపై కన్నేసిన భారత్ ఆగస్టు 24న బెంగళూరులో శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ సెప్టెంబర్ 2న తలపడనున్నాయి.