Rohit Sharma | విధ్వంసం, విశ్వరూపం, వీరవిహారం.. ఈ ఉపమానాలన్నీ ఆ ఇన్నింగ్స్ ముందు దిగదుడుపే! పరుగుల సునామీ, సిక్సర్ల జడివాన, రికార్డుల ఊచకోత.. ఇవన్నీ చాలా చిన్న పదాలే ఆ దంచుడు ముందు!! బౌలర్ చేతి నుంచి బంతి వచ్చిందే తడువు.. ఆకలిగొన్న సింహంలా దానిపై విరుచుకుపడిన హిట్మ్యాన్.. స్టాండ్స్లో పడేయడమే తన లక్ష్యమన్నట్లు శివతాండవం ఆడాడు. అఫ్గాన్ బౌలర్లను బెంబేలెత్తిస్తూ.. ఫీల్డర్లను ప్రేక్షకులుగా మారుస్తూ ఢిల్లీ స్టేడియంలో రోహిత్ విధ్వంసకాండ రచించడంతో వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది.
భారత బౌలర్లను ఎదుర్కొంటూ.. అఫ్గానిస్థాన్ అంత పెద్ద స్కోరు చేసినప్పుడే అది బ్యాటింగ్ పిచ్ అని అర్థమైపోగా.. ఆ తర్వాత మనవాళ్ల బాదుడుకు బౌండ్రీలే చిన్నబోయాయి. బౌలింగ్లో బుమ్రాతో పాటు పాండ్యా రాణిస్తే.. బ్యాటింగ్లో రోహిత్కు కోహ్లీ, ఇషాన్ సహకారమందించారు. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ సాధికారిక విజయాలు ఖాతాలో వేసుకున్న టీమ్ఇండియా ఇక శనివారం దాయాది పాకిస్థాన్ పనిపట్టేడమే తరువాయి!!
న్యూఢిల్లీ: బౌలర్ల విజృంభణకు బ్యాటర్ల సహకారం తోడవడంతో.. వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. తొలి పోరులో కంగారూలను చిత్తుచేసిన భారత్.. బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ను మట్టికరిపించింది. బ్యాటింగ్కు స్వర్గధామం లాంటి పిచ్పై టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80; 8 ఫోర్లు, ఒక సిక్సర్), అజ్మతుల్లా ఓమర్జాయ్ (62; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించగా. రహ్మానుల్లా గుర్బాజ్ (21), ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (16), మహమ్మద్ నబీ (19) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ (16; ఒక ఫోర్, ఒక సిక్సర్) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 35 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. వన్డే ప్రపంచకప్లో భారత్కు ఇది నాలుగో అత్యధిక లక్ష్యఛేదన కావడం గమనార్హం. కెప్టెన్ రోహిత్ శర్మ (84 బంతుల్లో 131; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. విరాట్ కోహ్లీ (55 నాటౌట్; 6 ఫోర్లు), ఇషాన్ కిషన్ (47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. రికార్డు సెంచరీ నమోదు చేసిన రోహిత్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. వరల్డ్కప్లో భాగంగా శనివారం జరగనున్న తమ తదుపరి మ్యాచ్లో టీమ్ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది.
వరల్డ్కప్లో అత్యంత ఒత్తిడితో కూడుకున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ముందు రోహిత్ సేన సమిష్టిగా సత్తాచాటింది. పరుగుల రన్వే లాంటి పిచ్పై అఫ్గాన్ ఓ మాదిరి స్కోరుకే పరిమితం కాగా.. టీమ్ఇండియా దంచికొట్టింది. ముఖ్యంగా గత మ్యాచ్లో సున్నాలు చుట్టిన ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. చినుకులా మొదలైన ఛేదన.. కాసేపట్లోనే తుఫాను తలపిస్తూ.. పరుగుల సునామీ సృష్టించింది. తొలి మూడు ఓవర్లలో ఒక్క ఫోర్ మాత్రమే కొట్టిన మన ఓపెనర్లు.. ఆ తర్వాత దంచుడే పనిగా పెట్టుకున్నారు. ఫజల్హక్ వేసిన ఐదో ఓవర్లో 6,4,4 బాదిన రోహిత్.. వరల్డ్కప్లో అత్యంత వేగంగా (19 ఇన్నింగ్స్ల్లో) వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్గా వార్నర్ రికార్డును సమం చేశాడు. ఫజల్హక్ తదుపరి ఓవర్లోనూ హిట్మ్యాన్ సేమ్ సీన్ (4,4,6) రిపీట్ చేశాడు. ఈ క్రమంలో రోహిత్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 10 ఓవర్లలో భారత స్కోరు 94కు చేరింది. వన్డేల్లో తొలి పవర్ప్లేలో టీమ్ఇండియాకు ఇది రెండో అత్యధికం కాగా.. అందులో రోహిత్వే 76 పరుగులు ఉన్నాయంటే అతడు ఏ రేంజ్లో రెచ్చిపోయాడో అర్థం చేసుకోవచ్చు. మరో ఎండ్ నుంచి ఇషాన్ కూడా దంచుడు ప్రారంభించగా.. ఈ మధ్యలో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా క్రిస్గేల్ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న రోహిత్ 63 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోగా.. తొలి వికెట్కు 156 పరుగులు జోడించిన అనంతరం ఇషాన్ ఔటయ్యాడు. అయినా ఏమాత్రం దూకుడు తగ్గించని రోహిత్ జట్టును విజయతీరాలకు చేర్చగా.. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మిగిలిన పని పూర్తి చేశారు.
భారత బ్యాటర్ల విన్యాసాలు వీక్షించేందుకు మైదానానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరాగా.. స్టేడియం కిక్కిరిసిపోయింది. ఛేదనలో తొలి బంతి నుంచే భారత ఓపెనర్లు బాదుడు మొదలెట్టడంతో.. ఫ్యాన్స్ అరుపులు, కేకలతో స్టేడియాన్ని మోత మోగించారు. రోహిత్ పుల్ షాట్లను మనసారా ఆస్వాదించిన అభిమానులు.. లోకల్ బాయ్ విరాట్ కోహ్లీ అడుగేస్తే చాలు బ్రహ్మరథం పట్టారు. విరాట్ సింగిల్ తీసినా.. బౌండ్రీ బాదినా అభిమానుల కేరింతలతో స్టేడియం మారుమోగిపోయింది. ఇక అఫ్గాన్ పేసర్ నవీన్ ఉల్ హక్కు మాత్రం ఈ మ్యాచ్ ఓ పీడకలను మిగిల్చింది. ఐపీఎల్ సందర్భంగా కోహ్లీ, నవీన్ మధ్య స్వల్ప వాగ్వాదం జరగగా.. అది మనసులో పెట్టుకున్న భారత అభిమానులు నవీన్ ఎక్కడ కనిపించినా.. ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అయితే ఈ ఇద్దరు ప్లేయర్లు మాత్రం పాత విషయాలను పక్కన పెట్టి సరదాగా నవ్వుతూ కనిపించడం కొసమెరుపు.
ఢిల్లీలోనే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న కోహ్లీ పేరు మీద ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఓ స్టాండ్ను ఏర్పాటు చేశారు. దానికి అతడి పేరే పెట్టగా.. బుధవారం అఫ్గాన్తో మ్యాచ్లో బ్యాటింగ్ చేసేందుకు కోహ్లీ అక్కడి నుంచే మైదానంలో అడుగుపెట్టాడు. ఆటకు ఘనకీర్తి సాధించి పెట్టిన ఆటగాళ్ల పేర్లను స్టాండ్లకు పెట్టడం మనదేశంలో పరిపాటే కాగా.. వన్డే ప్రపంచకప్ జరుగుతున్న మైదానంలో తన పేరిటే ఉన్న స్టాండ్ నుంచి వచ్చే అవకాశం విరాట్కే దక్కింది.
వన్డే ప్రపంచకప్లో అత్యధిక (7) సెంచరీలు చేసిన ప్లేయర్గా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. సచిన్ టెండూల్కర్ (6) రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ 6 వరల్డ్కప్లలో ఈ ఘనత సాధిస్తే.. హిట్మ్యాన్ మూడు (2015, 2019, 2023) మెగాటోర్నీల్లో 19 ఇన్నింగ్స్ల్లోనే మాస్టర్ రికార్డును బ్రేక్ చేశాడు. గత ప్రపంచ కప్లో రోహిత్ 5 సెంచరీలతో
మోత మోగించిన విషయం తెలిసిందే.
వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో రోహిత్(31) మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (30)ను హిట్మ్యాన్ వెనక్కి నెట్టాడు. సచిన్ టెండూల్కర్ (49), కోహ్లీ (47) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
వరల్డ్కప్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన (63 బంతుల్లో) సెంచరీని రోహిత్ తన పేరిట రాసుకున్నాడు. హర్యానా హరికేన్ కపిల్దేవ్ (72 బంతుల్లో) 1983 ప్రపంచకప్లో నెలకొల్పిన రికార్డును రోహిత్ అధిగమించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు (556) కొట్టిన ప్లేయర్గా రోహిత్ చరిత్రకెక్కాడు. అఫ్గాన్తో మ్యాచ్లో విండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ (553)ను వెనక్కి నెట్టాడు. షాహిద్ అఫ్రిది (476) మూడో స్థానంలో ఉన్నాడు.
ప్రపంచకప్లో అతి తక్కువ (19) ఇన్నింగ్స్ల్లో వెయ్యి పరుగులు చేసిన ప్లేయర్గా రోహిత్.. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సరసన చేరాడు. సచిన్ (20 ఇన్నింగ్స్ల్లో), గంగూలీ (21 ఇన్నింగ్స్ల్లో) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
2003 ప్రపంచకప్లో సౌరవ్ గంగూలీ సెంచరీ చేసిన అనంతరం వరల్డ్కప్లో భారత సారథి శతకం బాదడం ఇదే తొలిసారి.
అఫ్గానిస్థాన్: 272/8 (హష్మతుల్లా 80, అజ్మతుల్లా 62; బుమ్రా 4/39, హార్దిక్ 2/43),
భారత్: 35 ఓవర్లలో 273/2 (రోహిత్ 131, కోహ్లీ 55 నాటౌట్; రషీద్ 2/57).