బెంగళూరు: టీమ్ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త అవతారం ఎత్తాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు దూరమైన హిట్మ్యాన్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ కసరత్తులు ప్రారంభించాడు. అదే సమయంలో ఈ నెల 23 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న అండర్-19 ఆసియా కప్ కోసం భారత యువ జట్టు బెంగళూరులోనే ప్రాక్టీస్ చేస్తుండటంతో రోహిత్.. జూనియర్లకు పాఠాలు చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం ఉన్న రోహిత్.. యువ ఆటగాళ్లకు విలువైన సూచనలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. సఫారీ టూర్ ప్రారంభానికి ముందు కండరాల గాయం తిరగబెట్టడంతో రోహిత్ టెస్టు సిరీస్కు దూరం కాగా.. మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న జడేజా కూడా ఎన్సీఏలోనే పునరావాసం పొందుతున్నాడు.