Yashasvi Jaiswal | అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న తొలి మ్యాచ్లోనే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. విండీస్ బౌలర్లను చీల్చి చెండాడుతూ.. తొలి టెస్టులోనే శతకంతో చెలరేగిపోయాడు. యశస్వి దూకుడుకు కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీ తోడవడంతో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా సాగుతున్నది. ఏమాత్రం పసలేని కరీబియన్ బౌలింగ్ను ఓ ఆటాడుకున్న భారత ఓపెనర్లు తొలి వికెట్కు 229 పరుగులు జోడించడం విశేషం.
డొమినికా: ఓపెనర్లు దంచికొట్టడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. జాతీయ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ (244 బంతుల్లో 116 పరుగులు; 12 ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (221 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. ఓవర్నైట్ స్కోరు 80/0తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగింది. విండీస్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో.. యశస్వి, రోహిత్ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టారు. ఎక్కడ తొందరపాటుకు పోని ఈ ఇద్దరూ ఒక్కో పరుగు జోడిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. తొలి సెషన్ మొత్తం విండీస్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. రెండో సెషన్లోనూ మన వాళ్ల జోరు కొనసాగింది. ఈ క్రమంలో మొదట యశస్వి 215 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే జైస్వాల్ శతకం బాదితే.. మరికాసేపటికే రోహిత్ 220 బంతుల్లో సెంచరీ మార్క్ దాటాడు. అయితే తదుపరి బంతికే రోహిత్ క్యాచ్ ఔట్గా వెనుదిరగడంతో 229 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం వన్డౌన్లో వచ్చిన శుభ్మన్ గిల్ ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బందిగా కనిపించిన గిల్.. స్లిప్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. టీ సమయానికి భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.
తొలి టెస్టులోనే సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ దిగ్గజాల సరసన చేరాడు. గతంలో భారత్ తరఫున లాలా అమర్నాథ్, గుండప్ప విశ్వనాథ్, మహమ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్ కూడా ఈ ఘనత సాధించారు. ఓవరాల్గా భారత్ తరఫున ఆడిన తొలి టెస్టులోనే శతక్కొట్టిన 17వ ప్లేయర్గా యశస్వి నిలిచాడు.