టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రవీంద్ర జడేజా స్పాట్లైట్లో నిలిచినప్పటికీ.. అశ్విన్ కూడా తను తక్కువేమీ కాదని నిరూపించాడు. బ్యాటుతో హాఫ్ సెంచరీతో అదరగొట్టడమే కాకుండా.. బౌలింగ్లో ఆరు వికెట్లు తీశాడు.
ఈ నేపథ్యంలో అశ్విన్ గురించి టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తన దృష్టిలో అశ్విన్ ఒక ఆల్ టైం గ్రేట్ అని చెప్పాడు. లంకతో జరిగిన మ్యాచ్లో భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కపిల్ దేవ్ (434) రికార్డును దాటిన అశ్విన్ (436) చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 9వ స్థానంలో నిలిచాడు.
అతనికన్నా ముందు సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ (439) ఉన్నాడు. అయితే అశ్విన్ కేవం 85 టెస్టుల్లోనే 430పైగా వికెట్లు తీయగా, కపిల్ దేశ్ ఈ ఫీట్ సాధించడానికి 131 టెస్టులు తీసుకోవడం గమనార్హం. ఇలాంటి బౌలర్ను ఇంగ్లండ్ సిరీస్లో ఎందుకు పక్కన పెట్టారు? అసలు సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా) దేశాల పర్యటనల్లో ఎందుకు ఉపయోగించుకోలేదని అడగ్గా.. తను అప్పుడు జట్టును ఎంపిక చేసే బృందంలో లేనని, ఆ విషయంలో తనకేమీ తెలియదని రోహిత్ స్పష్టం చేశాడు.
అయితే అశ్విన్ తీసిన 436 వికెట్లలో 306 వికెట్లు భారత్లో తీయగా.. ఉపఖండంలో 57 టెస్టుల్లో 378 వికెట్లు పడగొట్టాడు. విదేశాల్లో 24 టెస్టులు ఆడి కేవలం 70 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో అతన్ని ఎంపిక చేసినప్పటికీ.. ఒక్క టెస్టులో కూడా అవకాశం ఇవ్వకపోవడంతో బెంచ్కే పరిమితమయ్యాడు.