Rohan Jaitley : ఢిల్లీ క్రికెట్ సంఘం(DCA) అధ్యక్షుడు రోహన్ జైట్లీ (Rohan Jaitley) భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నూతన సెక్రటరీ రేసులో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో జై షా(Jai Shah) వారసుడిగా అతడి నియామకం ఖాయమైనట్టే అని మీడియా కోడై కూస్తోంది. అయితే.. తనపై వస్తున్న కథనాలపై రోహన్ మంగళవారం స్పందిస్తూ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. బీసీసీఐ సెక్రటరీ రేసులో తాను లేనని, అవన్నీ గాలి వార్తలని ఆయన కొట్టిపారేశాడు. దాంతో, ఇదేంటీ..? ఇలా షాకిచ్చాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
బీసీసీఐ సెక్రటరీ పదవి చేపట్టాలనే ఉద్దేశం తనకు లేదని, ఢిల్లీ క్రికెట్ సంఘం అభివృద్ధిపైనే తన ఫోకస్ ఉందని రోహన్ చెప్పినట్టు సమాచారం. మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ(Arun Jaitley) కుమారుడైన రోహన్ బీసీసీఐ తదుపరి సెక్రటరీగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమే అని వార్తలు వినిపించాయి. కానీ, రోహన్ మాత్రం తనకు ఏమాత్రం ఆసక్తి లేదని అంటున్నాడు.
దాంతో, కార్యదర్శి రేసులో ఉండేది ఎవరు? అని ఫ్యాన్స్ చర్చించుకున్నారు. ప్రస్తుతం బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన(CAB) అధ్యక్షుడు అవిషేక్ దాల్మియాలు పోటీలో నిలిచే అవకాశముంది. ఇక రోహన్ విషయానికొస్తే.. 2021లో డీసీఏకు జరిగిన ఎన్నికల్లో అతడు 1,658 ఓట్లు సాధించి సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ (Vikas Singh)పై గెలుపొందాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్ష ఎన్నికలకు వేళైంది. త్వరలోనే ఐసీసీ సభ్య దేశాలు కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న గ్రెగ్ బార్క్లే (Greg Barclay) పదవీ కాలం నవంబర్లో ముగియనుంది.
ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ పదవిలో ఉన్న గ్రెగ్ ఇక వైదొలగాలని భావిస్తున్నాడు. అందువల్ల కొత్త బాస్ ఎంపిక అనివార్యమైంది. ఐసీసీ పీఠంపై జై షా కన్నేశాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అతడు పోటీలో నిలిస్తే కొత్త చీఫ్ ఎన్నిక ఏకగ్రీవం కావడం పక్కా అంటున్నారు విశ్లేషకులు. ఐసీసీ అధ్యక్షపదవి కోసం నామినేషన్ వేసేందుకు ఆగస్టు 27వ తేదీ ఆఖరు.