Rohan Bopanna : భారత సీనియర్ డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న(Rohan Bopanna) కీలక నిర్ణయ తీసుకున్నాడు. త్వరలోనే డేవిస్ కప్(Davis Cup) టోర్నీకి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నాడు. అవును.. ఈ ఏడాది సెప్టెంబర్లో జరగనున్న టోర్నీ అతడి కెరీర్లో ఆఖరి డేవిస్ కప్ కానుంది. ఈ పోటీల్లో భారత జట్టు మొరాకో బృందంతో తలపడనుంది.
‘నా ఆఖరి డేవిస్ కప్ మ్యాచ్ సొంతూరు అయిన బెంగళూరులో జరగాలని కోరుకుంటున్నా. ఈ విషయం గురించి భారత ఆటగాళ్లందరితో మాట్లాడాను. వాళ్లు అక్కడ ఆడేందుకు సంతోషంగా ఒప్పుకున్నారు’ అని బోపన్న తెలిపాడు. కానీ, ఆలిండియా టెన్నిస్ సమాఖ్య(AITA) ఈ మ్యాచ్ను ఉత్తరప్రదేశ్లో నిర్వహించాలని ముందే నిర్ణయం తీసుకుంది.
కర్నాటకకు చెందిన బోపన్న ఇరవై ఏళ్లుగా టెన్నిస్ ఆడుతున్నాడు. అతడికి డేవిస్ కప్లో మెరుగైన రికార్డు ఉంది. 12 సింగిల్స్ టైటిళ్లు, 10 డబుల్స్ ట్రోఫీలు గెలిచాడు. 2002లో ఈ టోర్నమెంట్లో తొలి మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకూ అతను భారత్ తరఫున 32 టైస్ ఆడాడు. అయితే.. ఈ జాబితాలో లియాండర్ పేస్(Leander Paes) 58 టైస్తో ముందంజలో ఉన్నాడు. ఆ తర్వాత జైదీప్ ముఖర్జీ(43), రామనాథన్ కృష్ణన్(43) సంయుక్తంగా రెండో ప్లేస్లో నిలిచారు. ప్రేమ్జిత్ లాల్(41), ఆనంద్ అమృత్రాజ్(39), మహేశ్ భూపతి(35), విజయ్ అమృత్రాజ్(32) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.