న్యూఢిల్లీ/లండన్: సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో కరోనా కలకలం రేగింది. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్తో పాటు త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్ కొవిడ్-19 బారిన పడ్డట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. వీరితో కాంటాక్ట్లో ఉన్న మరో ముగ్గురు సభ్యులకు కరోనా నెగెటివ్ అని తేలినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వారిని కూడా 10 రోజుల ఐసొలేషన్లో ఉంచారు. న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఓటమి అనంతరం భారత జట్టుకు సుదీర్ఘ విరామం లభించడంతో బయో బబుల్ను వీడిన ఆటగాళ్లు.. 20 రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా వచ్చే నెల 4 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి పోరు ప్రారంభం కానుండగా.. జట్టు సభ్యులంతా ప్రాక్టీస్ మ్యాచ్ల కోసం గురువారం డర్హంకు బయలుదేరారు.
విరామ సమయంలో యూరో చాంపియన్షిప్ మ్యాచ్లు చూసేందుకు వెళ్లిన రిషబ్ పంత్కు అదే సమయంలో కరోనా సోకినట్లు తెలుస్తున్నది. ఈనెల 7న వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న పంత్.. 8న నిర్వహించిన పరీక్షల్లో డెల్టా వైరస్ బారిన పడ్డాడు. దీంతో అప్పటి నుంచి జట్టు సభ్యులకు దూరంగా ఐసోలేషన్లో ఉంటున్నాడు. కాగా.. అతడికి స్వల్ప జ్వరం తప్ప పెద్దగా లక్షణాలు లేవని బోర్డు తెలిపింది. బుధవారం నిర్వహించిన పరీక్షల్లో దయానంద్కు పాజిటివ్ అని తేలడంతో.. అతడితో కాంటాక్ట్లో ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, రిజర్వ్ వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహా, స్టాండ్బై ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ లండన్లోనే ఐసోలేషన్లో ఉంచారు. ‘విరామ సమయంలో పంత్ జట్టు హోటల్లో బస చేయలేదు. అతడికి ఈనెల 8న వైరస్ సోకింది. దీంతో అప్పటి నుంచి ప్రత్యేక ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపాడు.
టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమ్ఇండియా ఈనెల 20 నుంచి డర్హంలో కౌంటీ జట్టుతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనుంది. ఈ మ్యాచ్లకు పంత్తో పాటు సాహా, ఈశ్వరన్ కూడా అందుబాటులో ఉండరని బోర్డు స్పష్టం చేసింది. నేటి నుంచి జట్టు సభ్యులందరికీ ప్రతీరోజు కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు పేర్కొంది. ఆటగాళ్లంతా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని జై షా సూచించాడు. సమూహాలకు దూరంగా ఉంటూ కొవిడ్ నిబంధనలు పాటించాలని జట్టు సభ్యులకు లేఖ రాశాడు.